ఢిల్లీ అల్లర్లు : నాలుగుకి చేరిన మృతుల సంఖ్య.. నేడు స్కూల్స్ మూసివేత..
దేశ రాజధాని ఢిల్లీలో చెలరేగిన హింసలో నలుగురు మృతి చెందారు. మరో 50 మంది గాయపడ్డారుజ గాయపడ్డవారిలో పారామిలటరీ సిబ్బందితో పాటు ఢిల్లీ పోలీసులు కూడా ఉన్నారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో నార్త్ ఢిల్లీలో 144 సెక్షన్ విధించారు. ఆందోళనకారులు పలు ఇళ్లు,దుకాణాలు,వాహనాలు,పెట్రోల్ బంకులకు నిప్పు పెట్టడంతో నార్త్ ఢిల్లీ రణరంగాన్ని తలపించింది.
సీఏఏ ఆందోళనకారులు,మద్దతుదారులకు మధ్య జరిగిన ఘర్షణ సందర్భంగా పరస్పరం రాళ్ల దాడి చేసుకోవడంతో రతన్ లాల్(42) అనే హెడ్ కానిస్టేబుల్ మృతి చెందాడు. గోకల్పురిలోని ఏసీపీ కార్యాలయంలో అతను పనిచేస్తున్నాడు. అతనితో పాటు మరో ముగ్గురు సాధారణ పౌరులు మృతి చెందారు. దాదాపు 11 మంది పోలీస్ సిబ్బంది గాయపడ్డారు. వీరిలో షహ్దరా డీసీపీ అమిత్ శర్మ,గోకల్పురి ఏసీపీ అనుజ్ కుమార్ ఉన్నారు. మరో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు కూడా గాయపడ్డారు.
ట్రంప్ పర్యటన సందర్భంగా అందరి దృష్టిని ఆకర్షించేందుకే కొంతమంది కావాలని దాడులకు పాల్పడ్డారని ప్రభుత్వ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఢిల్లీ పోలీస్ కమిషనర్ అమూల్య నాయక్ ప్రస్తుతం పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి పరిస్థితిని సమీక్షిస్తున్నారని వెల్లడించాయి. ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులోనే ఉందని హోంశాఖ సెక్రటరీ అజయ్ భళ్ల తెలిపారు. దాదాపు 8 కంపెనీలకు చెందిన 100 మంది అదనపు సాయుధ బలగాలను రంగంలోకి దించినట్టు అధికారులు తెలిపారు.
ఇక హింసాయుత ఘటనల కారణంగా రేపు నార్త్ ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ,ప్రైవేట్ పాఠశాలలను మూసివేస్తున్నట్టు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా తెలిపారు. కాగా,ఘటనకు బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తప్పవని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్ రెడ్డి హెచ్చరించారు.హింస చెలరేగిన మౌజ్పూర్,జాఫ్రాబాద్,గోకుల్పురిలోని చాలా ప్రాంతాల్లో రోడ్లపై రాళ్లు,పగిలిన అద్దాలు కనిపిస్తున్నాయి. మౌజ్పూర్లో ఆందోళనకారులు మూడు వాహనాలకు నిప్పు పెట్టారు. ఓ ఇంటిని తగలబెట్టారు. ఆందోళనల సందర్భంగా గాల్లోకి కాల్పులు జరిపిన నిందితుడిని షారుఖ్గా గుర్తించారు.
Recommended Video
సీఏఏ మద్దతుదారులు సైతం మౌజ్పూర్ ప్రాంతంలో ఓ వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. దాంతో అతని తల నుంచి రక్తం కారింది. కొంతమంది సీఏఏ మద్దతుదారులు రెచ్చగొట్టే రీతిలో నినాదాలు చేశారు. భజన్పురా-యమునా విహార్ మార్గంలో ఒక పెట్రోల్ పంప్,రెండు స్కూల్ బస్సులను ఆందోళనకారులు తగలబెట్టారు. కర్రలు పట్టుకుని తిరుగుతున్న పలువురు ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు.