భారీ ఎన్కౌంటర్: టాప్ కేడర్: నడ్డి విరిగిన మావోయిస్టు కేకేబీఎన్ డివిజన్: నలుగురు దుర్మరణం
భువనేశ్వర్: ఒడిశాలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. కొంధమాల్ జిల్లాలోని దట్టమైన శిర్లా అటవీ ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ఎన్కౌంటర్.. ఓ రకంగా మావోయిస్టుల నడ్డి విరిచినట్లుగా చెబుతున్నారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్లల్లో క్రియాశీలకంగా ఉంటోన్న కొంధమాల్-కలహండి-నయాగఢ్-బౌద్ధ్ (కేకేబీఎన్)కు చెందిన నలుగురు టాప్ క్యాడర్ మావోయిస్టులు దుర్మరణం పాలయ్యారు. ఫలితంగా కేకేబీఎన్ డివిజన్ మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ తగిలినట్లుగా అనుమానిస్తున్నారు.
ఒడిశాలో దట్టమైన అడవులతో నిండివున్న జిల్లా కొంధమాల్. కేకేబీఎన్ డివిజన్ మావోయిస్టులకు గట్టిపట్టు ఉన్న డివిజన్ ఇది. దీన్ని బేస్ పాయింట్గా చేసుకుని ఒడిశా సహా ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో మావోయిస్టులు క్రియాశీలకంగా ఉంటున్నారనేది బహిరంగ రహస్యం. ఈ డివిజన్ పరిధిలోని తుమిడిబంధ్ ఏరియా సమీపంలో గల దట్టమైన శిర్లా అడవుల్లో కేకేబీఎన్ డివిజన్ టాప్ క్యాడర్ సమావేశమైనట్లు పక్కా సమాచారం లభించింది ఒడిశా పోలీసులకు.
ఈ సమాచారం అందిన వెంటనే స్పెషల్ ఆపరేషన్ గ్రూప్, ఒడిశా పోలీసులతో ఏర్పాటైన డిస్ట్రిక్ట్ వలంటర్లీ ఫోర్స్ బలగాలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మావోయిస్టులు సమావేశమైన ప్రదేశాన్ని చుట్టుముట్టారు. ఈ సందర్భంగా చోటు చేసుకున్న ఎదురు కాల్పుల్లో మొత్తం నలుగురు కేకేబీఎన్ డివిజన్ మావోయిస్టులు దుర్మరణం పాలయ్యారు. సుమారు రెండు గంటలకు పైగా ఈ రెండు వర్గాల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
Recommended Video
అనంతరం సంఘటనా స్థలం నుంచి పోలీసు బలగాలు పెద్ద ఎత్తున ఆయుధాలు, ఇతర పేలుడు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. మూడు లైసెన్స్ గల రైఫిళ్లు, రెండు దేశీ పిస్టళ్లు, పలు పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని ఒడిశా ఐజీ (ఆపరేషన్స్) అమితాబ్ ఠాకూర్ తెలిపారు. ఈ ఎన్కౌంటర్లో మరణించిన నలుగురు మావోయిస్టుల వివరాల గురించి ఆరా తీస్తున్నామని అన్నారు. త్వరలోనే వారి వివరాలను వెల్లడిస్తామని చెప్పారు.