రుణం తీసుకున్న వ్యక్తి మృతి: ఆందోళనతో ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య !
బెంగళూరు: భారీ మొత్తంలో రుణం తీసుకున్న వ్యక్తి మరణించాడని, ఇక అప్పుఇచ్చిన డబ్బు తిరిగిరాదని ఆందోళనతో ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరు నగరంలోని విద్యారణ్యపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని దోడ్డబోమ్మసంద్ర ప్రాంతంలో జరిగింది.
జనార్దన్ (59), సుమిత్ర (45), వీరి కుమార్తె సుధారాణి (29), సోనికా (6) అనే నలుగురు ఇంటిలో ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు అన్నారు. ఒకే కుటుంబంలోని దంపతులతో పాటు వారి కుమార్తె, మనుమరాలు ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు చెప్పారు.
సోనికా ముఖానికి ప్లాస్టిక్ కవర్ చుట్టి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సన్నిహితంగా ఉంటున్న స్నేహితుడు ఇంటిని కొనుగోలు చెయ్యాలని చెప్పడంతో అతనికి జనార్దన్ రూ. 25 లక్షలు రుణం ఇచ్చాడు.
రుణం తీసుకున్న వ్యక్తి ఇటీవల ప్రమాదంలో మరణించాడు. రూ. 25 లక్షలు రుణం తీసుకున్న వ్యక్తి ప్రమాదంలో మరణించాడని, ఆ డబ్బు తిరిగిరాదని, కుటుంభాన్ని పోషించడం భారం అవుతోందని జనార్దన్ ఆందోళన చెందాడు. అంత భారీ మొత్తంలో నగదు తిరిగిరాకపోతే కుటుంబ సమస్యలు ఎదురౌతాయని జనార్దన్ కుమిలిపోయాడని తెలిసింది.
తాను ఇచ్చిన నగదు తిరిగి ఇవ్వకపోతే ఇబ్బందులు ఎదురౌతాయని ఆందోళన చెందిన జనార్దన్ కుటుంబ సభ్యులతో కలిసి విషం సేవించి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు అంటున్నారు. జనార్దన్ ఆత్మహత్య చేసుకునే ముందు డెత్ నోట్ రాసి పెట్టారు. డెత్ నోట్ లో స్నేహితుడికి రుణం ఇచ్చిన విషయం, అతను ఇల్లు కొనుగోలు చేసిన విషయం జనార్దన్ రాసిపెట్టారని, వారి కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించి విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.