కాశ్మీర్ లో నలుగురు పాక్ మిలిటెంట్లు హతం
కాశ్మీర్: జమ్మూ కాశ్మీర్ లో వరుసగా మిలిటెంట్లను అంతం చేస్తున్నారు. మిలిటెంట్లు తలదాచుకున్నారని సమాచారం ఇవ్వడంతో సైన్యం, పోలీసులు, పారా బలగాలు రంగంలోకి దిగాయి. దాదాపు 9 గంటల పాటు ఈ ఎన్ కౌంటర్ జరిగింది.
గురువారం జమ్మూ కాశ్మీర్ పోలీసు అధికారులు వివరాలు వెల్లడించారు. ఉత్తర కాశ్మీర్ లోని కుప్వారా జిల్లాలోని హండ్వారా ప్రాంతంలోని సోచల్ వారీ గ్రామంలో మిలిటెంట్లు తలదాచుకున్నారని సైనికులకు సమాచారం అందింది.
వెంటనే స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ కు చెందిన పోలీసులు, సైనికులు, పారా బలగాలు సోదాలు నిర్వహించారు. బుధవారం రాత్రి 8.30 గంటల సమయంలో విషయం పసిగట్టిన మిలిటెంట్లు పోలీసులు, సైనికుల మీద కాల్పులు జరిపారు.
వెంటనే అప్రమత్తం అయిన పోలీసులు, సైనికులు ఎదురు కాల్పులకు దిగారు. ఆ సందర్బంలో నలుగురు మిలిటెంట్లతో సహ ఓ సైనికుడు మరణించాడు. గురువారం వేకువ జామున వరకు ఈ ఎన్ కౌంటర్ జరిగిందని పోలీసు అధికారులు తెలిపారు.
ఇప్పటి వరకు ఇద్దరు మిలిటెంట్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని అధికారులు చెప్పారు. గత వారం పాకిస్థాన్ కు చెందిన హిజబుల్ ముజాహుద్దిన్ ఉగ్రవాది సాజద్ హుస్సేనీని సైనికులు ప్రాణాలతో పట్టుకున్నారు. అదే సమయంలో ముగ్గురు ఉగ్రవాదులను అంతం చేశారు.
సాజద్ హుస్సేనీ ఇచ్చిన సమాచారం మేరకు సైనికులు మిలిటెంట్లను అంతం చేశారని తెలిసింది. అయితే ఇంకా ఎంత మంది పాక్ మిలిటెంట్లు జమ్మూ కాశ్మీర్ లో తలదాచుకున్నారు అని అధికారులు ఆరా తీస్తున్నారు.