మరో షాక్? మమతా బెనర్జీ కేబినెట్ భేటీకి నలుగురు మంత్రులు డుమ్మా: ఆ ఒక్కరిపైనే అనుమానం
కోల్కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ అధికార టీఎంసీ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే దాదాపు పది టీఎంసీ నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి షాకిచ్చారు. టీఎంసీ కీలక నేత సువేందు అధికారితోపాటు పలువురు ఎమ్మెల్యేలు ఇటీవల బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.
కేబినెట్ భేటీకి నలుగురు మంత్రుల డుమ్మా
తాజాగా, మరో నలుగురు మంత్రులు మమతా బెనర్జీకి చెయ్యిస్తారా? అనేది సందేహంగా మారింది. మంగళవారం మమతా బెనర్జీ నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశానికి నలుగురు మంత్రులు డుమ్మా కొట్టడం గమనార్హం. దీంతో ఈ మంత్రులు కూడా టీఎంసీకి గుడ్ బై చెబుతారా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
నాలుగో మంత్రే మిస్..
అయితే, ఆ నలుగురు మంత్రుల్లో ముగ్గురు మాత్రం ఈ కేబినెట్ భేటీకి హాజరుకాకపోవడానికి గల కారణాలను వివరించారని టీఎంసీ సెక్రటరీ జనరల్ పార్థ ఛటర్జీ తెలిపారు. కేబినెట్ భేటీకి గైర్హాజరైన మంత్రుల్లో రబీంద్రనాథ్ ఘోష్, గౌతమ్ దేబ్, చంద్రనాథ్ సిన్హాలు ఉన్నారు. కానీ . నాలుగో మంత్రి రజీబ్ బెనర్జీ మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి కారణం తెలపలేదు, అందుబాటులో కూడా లేకపోవడం గమనార్హం.
టీఎంసీపై అసంతప్తిలో మంత్రి రాజీబ్ బెనర్జీ..
దోమ్జూర్ ఎమ్మెల్యే, అటవీశాఖ మంత్రి అయిన రజీబ్ బెనర్జీ గత కొన్ని వారాలుగా పార్టీ కార్యకలాపాలకు అంటీముట్టనట్లుగా ఉంటున్నారు. అంతేగాక, నవంబరులో కోల్కతాలో జరిగిన ఓ బహిరంగ సభలోనే పార్టీపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. టీఎంసీలో స్వపక్షపాతం పెరిగిపోయిందని, ఊ కొట్టేవారికే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. సువేందు అధికారి కూడా పార్టీని వీడిన తర్వాత ఇలాంటి విమర్శలే చేశారు. మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి ఆమె ప్రాధాన్యత ఇస్తున్నారని, పార్టీ కోసం పనిచేసిన కీలక నేతలను కూడా పక్కనపెడుతున్నారని ఆరోపించారు.
ప్రశాంత్ కిషోర్ మంతనాలు ఫలించలేదా?
కాగా, పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న రజీబ్ బెనర్జీతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు. పార్టీపై ఆయనుకున్న అసంతృప్తిని కిషోర్ తగ్గించే ప్రయత్నం చేశారు. టీఎంసీని వీడిన సువేందు అధికారితో తనను పోల్చవద్దని ఈ సందర్భంగా రాజీబ్ బెనర్జీ తెలిపారు. అయితే, అప్పటి వరకు మెత్తబడినట్లు కనిపించిన రాజీబ్.. తాజాగా కేబినెట్ భేటీకి గైర్హాజరవడంతో మళ్లీ అనుమానాలు రేకెత్తుతున్నాయి. రాజీబ్ కూడా పార్టీని వీడతారా? అనే సందేహాలు కలుగుతున్నాయి. ఈ మంత్రి కూడా కాషాయ పార్టీలోకి చేరతారా? అనే ప్రచారం జరుగుతోంది.