ఆ శవం అభిరామిది: శ్మశానంలో తవ్వి తీశారు, రూ.20 వేలకు కొన్నాడు
పెరంబలూరు మాంత్రికుడి కేసులో అత్యంత సంచలనమైన విషయాలు వెలుగు చూశాయి. శ్మశానం నుంచి శవాన్ని తవ్వి తీసినట్లు తెలుస్తోంది.
చెన్నై: తాజాగా బయటపడిన పెరంబలూరు మాంత్రికుడి కేసులో మరిన్ని విషయాలు వెలుగు చూశాయి. ఓ మహిళ శవాన్ని ఇంట్లో దాచిపెట్టుకుని కు మంత్రాలతో క్షుద్రపూజలకు పాల్పడిన కార్తికేయన్ అనే మాంత్రికుడ్ని గత శనివారం పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అతనితో పాటు అతని భార్య నసీమా భాను (21)ను కూడా పోలీసులు అరెస్టు చేశారు.
అతడి వద్ద లభించిన శవం ఎవరిది, ఎక్కడి నుంచి వచ్చిందనే విషయాన్ని కనుక్కోవడానికి ప్రయత్నించిన పోలీసులకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. మాంత్రికుడి చేతికి వచ్చిన ఆ శవం చెన్నై నడిబొడ్డున ఉన్న శ్మశాన వాటిక నుంచి తవ్వి తీసుకెళ్లినట్లు పోలీసులు కనిపెట్టారు. చెన్నై నగరానికి చెందిన ఓ బ్రోకర్ నుంచి రూ.20వేలకు శవాన్ని కొనుగోలు చేసినట్లు కార్తికేయన్ చెప్పాడు.
దీంతో పోలీసులు శనివారం రాత్రే చెన్నై చేరుకుని మైలాపూరు శ్మశానంలో తవ్వకపు పనులు చేస్తున్న ధనరాజ్, సతీష్, కార్తీక్ అనే ముగ్గురిని అరెస్టు చేశారు. శవాన్ని అమ్మిన బ్రోకర్ వినోద్కుమార్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఈ నలుగురిని కూడా విచారించారు.
ఈ క్రమంలో పెరంబలూరు మాంత్రికుడికి విక్రయించిన శవం చెన్నై తేనాంపేటకు చెందిన అభిరామి (20) అనే యువతిదిగా తెలిసింది. గత జనవరి 18న ఆమె ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోగా, అభిరామి మృత దేహానికి పోలీసులు పోస్టుమార్టం జరిపిన తర్వాత బంధువులు శవాన్ని మైలాపూరు శ్మశానంలో ఖననం చేశారు.
ఆ తర్వాత జనవరి 23న శ్మశానంలో పనిచేస్తున్న ధనరాజ్, సతీష్, కార్తీక్ ఆ శవాన్ని వెలికి తీసి పెరంబలూరు మాంత్రికుడికి ఇచ్చారు. చెన్నై నడిబొడ్డున ఉండే మైలాపూరు శ్మశానంలో శవాన్ని వెలికి తీసి విక్రయించిన సంఘటన తీవ్ర సంచలనం కలిగించింది.
చెన్నై నగరంలోని ఇతర శ్మశానాల్లో పనిచేస్తున్న సిబ్బంది వద్ద కూడా పోలీసులు తీవ్ర విచారణ జరుపుతున్నారు. పెరంబలూరు మాంత్రికుడి ఇంట్లో వందల సంఖ్యలో పుర్రెలు కూడా లభించడంతో అవి ఏయే శ్మశానాల నుంచి తరలించారనే విషయమై పోలీసులు రాష్ట్రమంతటా తీవ్ర విచారణ జరిపేందుకు సిద్ధమవుతున్నారు.