సుప్రీంకోర్టుకు కొత్తగా నలుగురు న్యాయమూర్తులు.. మొత్తం జడ్జిల సంఖ్య ఎంతో తెలుసా?
న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానానికి కొత్తగా నలుగురు న్యాయమూర్తులు నియమితులయ్యారు. సోమవారం ఉదయం వారు ప్రమాణ స్వీకారం చేశారు. వివిధ రాష్ట్రాల్లోని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు పదోన్నతి కల్పించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించారు. హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వీ రామసుబ్రమణియన్, పంజాబ్-హర్యానా ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కృష్ణ మురారి, రాజస్థాన్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ రవీంద్ర భట్, కేరళ హైకోర్టు చీఫ్ జస్టిస్ హృషికేష్ రాయ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. దీనితో సుప్రీంకోర్టులో ఉన్న మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 31 నుంచి 34కు పెరిగింది.
31 నుంచి 34కు
నిజానికి- చట్ట ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 31 వరకు మాత్రమే ఉండాలి. కిందటి నెల ఈ చట్టాన్ని కేంద్రప్రభుత్వం సవరించింది. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించాలనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 34కు పెంచింది. ఈ దిశగా చట్టంలో సవరణలను చేపట్టింది. దీనికి అనుగుణంగా న్యాయమూర్తుల సంఖ్యను పెంచాల్సి వచ్చింది. ఎవరెవర్నీ న్యాయమూర్తులుగా తీసుకోవాలో కేంద్ర ప్రభుత్వానికి సూచిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం ఈ నెల 18వ తేదీన కొన్ని ప్రతిపాదనలను పంపించింది. ఈ ప్రతిపాదనలపై కేంద్రం వెంటనే ఆమోద ముద్ర వేసింది. కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ అధికారులు దీన్ని పరిశీలించిన తరువాత తుది ఆమోదం కోసం ప్రధానమంత్రి కార్యాలయానికి ఈ ప్రతిపాదనలను పంపించారు. ప్రధానమంత్రి ఆమోదం తెలిపిన వెంటనే.. న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారాన్ని ఏర్పాటు చేశారు.
60 వేల కేసులు పెండింగ్..
బాధితులకు సత్వర న్యాయం అందించాలనేది చట్టం, న్యాయ వ్యవస్థల ప్రాథమిక సూత్రం. దీనికి భిన్నంగా ఒక్క సుప్రీంకోర్టులోనే 60 వేల వరకు కేసులో పరిష్కారానికి నోచుకోకుండా ఉండిపోయాయి. వాటన్నింటినీ వీలైనంత వేగంగా బూజు దులపాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. న్యాయమూర్తుల సంఖ్యను పెంచే దిశగా చర్యలు చేపట్టింది. చట్టాన్ని సవరించింది. ఫలితంగా- బదిలీలు, బెయిల్ మంజూరు వంటి కేసులను పరిష్కరించడానికి ఇకపై ఏక సభ్య ధర్మాసనం ఏర్పాటు కానుంది. దీనితోపాటు స్పెషల్ లీవ్ పిటీషన్, ముందస్తు బెయిల్ కోసం చేసుకునే పిటీషన్ల వంటి అంశాలను సింగిల్ బెంచ్ పరిధిలోకి తీసుకుని వచ్చే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. బెయిల్ కోసం రోజుల తరబడి నిరీక్షించాల్సిన అవసరం ఉండదని, స్పెషల్ లీవ్ పిటీషన్ వంటి అంశాలపై సత్వర తీర్పు వెలువడతాయని అంటున్నారు.