జమిలిపై బీజేపీ-కాంగ్రెస్ దూరం: టీఆర్ఎస్ ఓకే, టీడీపీ నో, సమాజ్వాది షరతు
న్యూఢిల్లీ: జమిలి ఎన్నికలపై పలు పార్టీల అభిప్రాయాన్ని లా కమిషన్ సేకరించింది. టీఆర్ఎస్ సహా నాలుగు పార్టీలు జమిలికి ఒకే చెప్పగా, టీడీపీ సహా తొమ్మిది పార్టీలు వ్యతిరేకించాయి. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మాత్రం ఏ అభిప్రాయం చెప్పలేదు. తాము ఇంకా ఏం నిర్ణయం తీసుకోలేదని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. జమిలిపై లా కమిషన్ రెండు రోజుల పాటు సంప్రదింపులు నిర్వహించింది. ఆదివారం ముగిసింది. ఈ సంప్రదింపులకు కాంగ్రెస్, బీజేపీ దూరంగా ఉన్నాయి.
జమిలి ఎన్నికలకు కేసీఆర్ ఒకే, లా కమిషన్కు లేఖ: 'మోడీకి సపోర్ట్ కాదు'
సంప్రదింపుల్లో టీఆర్ఎస్, ఎన్డీయే భాగస్వామ్య పక్షం అకాలీదళ్, అన్నాడీఎంకే, సమాజ్వాదీ పార్టీలు జమిలికి మద్దతు పలికాయి. టీడీపీ, జేడీఎస్, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, డీఎంకే, సీపీఐ, సీపీఎం, ఫార్వార్డ్ బ్లాక్, బీజేపీ భాగస్వామ్య పక్షమైన గోవా ఫార్వార్డ్ పార్టీలు జమిలిని వ్యతిరేకించాయి. ఈ నెలాఖరు వరకు అభిప్రాయం చెప్పాలని బీజేపీకి లా కమిషన్ సూచించింది. విపక్షాలను సంప్రదించాక నిర్ణయం చెబుతామని కాంగ్రెస్ తెలిపింది.
జమిలి ఎన్నికలకు మద్దతు పలికిన సమాజ్వాదీ ఓ షరతు పెట్టింది. తొలి ఏకకాలపు ఎన్నికలను 16వ లోకసభ పదవీకాలం ముగిసే 2019లోనే నిర్వహించాలని ఆ పార్టీ నేత రామ్ గోపాల్ యాదవ్ డిమాండ్ చేశారు. అదే జరిగితే యూపీలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం పదవీ కాలం ముందే ముగుస్తుందన్నారు. దేశంలో చిత్తానుసార ప్రజాస్వామ్యం రుద్దేందుకే జిమిలి అని ఏఏపీ నేత ఆశిష్ ఖైతాన్ ఆరోపించారు. జమిలి భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని, సమాఖ్య వ్యవస్థను నాశనం చేస్తుందన్నారు.
జమిలి సమాఖ్య ప్రజాస్వామ్యానికి విరుద్ధమని జేడీఎస్ ప్రతినిధి డానిష్ అలీ వెల్లడించారు. ప్రభుత్వం తొలుత ఎన్నికల సంస్కరణలపై గత లా కమిషన్ ఇచ్చిన నివేదికలను అమలు చేయాలన్నారు. జమిలి అవసరమేనని, అయితే 2024లో నిర్వహించాలని, అంతకుముందు వద్దని అన్నాడీఎంకే సూచించింది. ప్రాంతీయ అంశాలను జాతీయ అంశాలు మరుగున పడేస్తాయని, జాతీయ పార్టీలు ధన బలంతో చిన్న పార్టీలపై పైచేయి సాధిస్తాయని తృణమూల్ కాంగ్రెస్ నేత కళ్యాణ్ బందోపాధ్యాయ్ అన్నారు.