చివరి క్షణాలు: ఒకేసారి నలుగురికి ఉరి..చరిత్రలో తొలిసారి: అంతకుముందు బిల్లా-రంగా, ఇందిరా హంతకులు.. !
న్యూఢిల్లీ: యావత్ దేశాన్ని వణికించిన పారామెడికల్ విద్యార్థిని నిర్భయ అత్యాచారం కేసులో నలుగురు దోషుల సూర్యోదయాన్ని చూడలేరిక. ఆ నలుగురు కామాంధులు చివరి క్షణాలను లెక్కిస్తున్నారు. మరో గంటలో ఆ నలుగురి ప్రాణాలు గాల్లో కలిసిపోనున్నాయి. చట్టపరంగా ఉరికంబం నుంచి తప్పించుకోవడానికి వారు చేసిన చివరి ప్రయత్నం విఫలమైంది. నలుగురు దోషుల్లో ఒకడైన వినయ్ శర్మ దాఖలు చేసిన పిటీషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టి పడేసింది. ఫలితంగా- పవన్ కుమార్ గుప్తా, ముఖేష్ సింగ్, అక్షయ్ కుమార్ సింగ్, వినయ్ శర్మ ఉరికంబాన్ని ఎక్కడం ఖాయమైంది.
నాలుగో డెత్ వారెంట్.. చివరిదైంది..
నిజానికి- ఈ పాశవిక అత్యాచారం కేసులో నలుగురు దోషులు ఈ పాటికే ఉరికంబాన్ని ఎక్కి ఉండాల్సింది. ఈ ఏడాది జనవరి 22వ తేదీన వారికి తొలి డెత్ వారెంట్ జారీ అయింది. ఆ తరువాత ఫిబ్రవరి 1, మార్చి 5 తేదీల్లో ఉరిశిక్షను అమలు చేయడానికి డెత్ వారెంట్లు జారీ అయ్యాయి. చట్టంలో పొందుపరిచిన కొన్ని క్లాజులను వారు తమకు అనుకూలంగా మార్చుకోలగలిగారు. ఉరికంబం నుంచి మూడుసార్లు తప్పించుకోగలిగారు. ఈ సారి తప్పించుకోలేకపోయారు.
ఒకేసారి నలుగురిని ఉరికంబాన్ని ఎక్కించడం..
ఒకేసారి నలుగురిని ఉరితీయబోతుండటం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. అంతకుముందు.. కరడుగట్టిన నేరస్తులు బిల్లా, రంగా ఆ తరువాత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హంతకులు సత్వంత్ సింగ్, కెహర్ సింగ్లను ఒకేసారి ఉరి తీశారు. ఇప్పటిదాకా అదే రికార్డుగా కొనసాగింది. తాజాగా ఒకేసారి నలుగురిని ఉరికంబం ఎక్కించడం ఇదే తొలిసారి. దీనికోసం తీహార్ జైలు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తీహార్ కేంద్ర కారాగారం కాంప్లెక్స్లోని మూడో నంబర్ జైలులో వారికి ఉరి తీయనున్నారు.. మరి కాస్సేపట్లో.
ఆ కిరాతకానికి ఏడేళ్లు..
దేశ రాజధానిలో చోటు చేసుకున్న ఈ కిరాతక, అమానవీయ ఉదంతానికి ఏడేళ్లు ముగిసిపోయాయి. 2012 డిసెంబర్ 16వ తేదీన న్యూఢిల్లీలో ఆరుమంది కిరాతకులు కదులుతున్న బస్సులో నిర్భయపై రాక్షసంగా అత్యాచారానికి పాల్పడిన విషయాన్ని ఇప్పట్లో ఎవరూ మరిచిపోలేనిది. ఈ ఘటనలో రామ్ సింగ్, మహ్మద్, పవన్ కుమార్ గుప్తా, ముఖేష్ సింగ్, అక్షయ్ కుమార్ సింగ్, వినయ్ శర్మ దోషులుగా తేలారు. ఈ ఆరుమందిలో రామ్ సింగ్ తీహార్ జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు. మైనర్ కావడంతో మహ్మద్ మూడేళ్ల జైలు శిక్షను అనుభవించి విడుదలయ్యాడు. మిగిలిన నలుగురు కామాంధులు ఇన్ని సంవత్సరాలు తీహార్ జైలులో గడిపారు.
Recommended Video
మృతదేహాల తరలింపునకు టన్నెల్..
ఉరిశిక్షను అమలు చేసిన ఆ నలుగురి మృతదేహాలను తరలించడానికి తీహార్ కేంద్ర కారాగారంలో అధికారులు ప్రత్యేకంగా ఓ టన్నెల్ ను నిర్మించారు. ఉరి తీసిన ప్రదేశం నుంచి ఈ టన్నెల్ ద్వారానే నలుగురి మృతదేహాలను బయటికి తీసుకెళ్లనున్నట్లు అధికారులు చెబుతున్నారు. జైలు ప్రధాన ద్వారం గుండా మృతదేహాలను తరలించడం ఆనవాయితీ కాదనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు.