విషాదం: ఆర్థిక ఇబ్బందులతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య
ఫరీదాబాద్ : ఢిల్లీలోని బురారీ సామూహిక ఆత్మహత్య ఘటన మరువక ముందే హర్యానాలో మరో ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన సూరజ్ కుంద్ ప్రాంతంలో జరిగింది. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు స్టేషన్ హౌజ్ ఆఫీసర్ ఇన్స్పెక్టర్ విశాల్ కుమార్ తెలిపారు. ఆత్మహత్యకు పాల్పడిన వారంతా ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. గది నుంచి దుర్వాసన రావడంతో ఓ వ్యక్తికి అనుమానం వచ్చింది. వెంటనే చుట్టుపక్కల వారిని పిలువగా వారంతా వచ్చి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. అక్కడే రెండు గదుల్లో నలుగురు ఉరి వేసుకుని వ్రేలాడుతూ కనిపించారు.
ఇదిలా ఉంటే అక్కడే కనిపించిన సూసెడ్ నోట్లో ఆర్థిక ఇబ్బందులతోనే తామంతా చనిపోతున్నట్లు రాసి ఉంది. అయితే వీరంతా మూడు లేదా నాలుగు రోజుల క్రితమే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. చనిపోయిన వారిలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఒక సోదరుడు ఉన్నారు. వీరందరి వయస్సు 37 ఏళ్ల నుంచి 52 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు. వీరంతా అవివాహితులే కావడం విశేషం. ఇందులో మీనా మాథ్యూ వయస్సు 52 ఏళ్లుండగా... మిగతా ఇద్దరి వయస్సు నీనా 51 ఏళ్లు, జయ 49 ఏళ్లుగా గుర్తించారు. మరోవైపు సోదరుడు ప్రదీప్ వయస్సు 37 ఏళ్లుగా పోలీసులు గుర్తించారు.
ఆర్థిక ఇబ్బందులు, పేదరికంతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని స్థానికులు తెలిపారు. చనిపోయిన వారిలో ఒక మహిళ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతోందని డయాలసిస్ చేసుకునేందుకు వారి దగ్గర డబ్బులు లేవని చెప్పారు. గత ఆరు నెలలుగా జీవనం సాగించేందుకు పొరిగింటి వారిదగ్గర నుంచి డబ్బులు అప్పుగా తీసుకున్నట్లు వెల్లడించారు. వీరి తల్లిదండ్రులు ఇద్దరు కొన్ని నెలల క్రితమే మృతి చెందినట్లు స్థానికులు చెప్పారు. ఇద్దరు తల్లదండ్రులు హర్యనా ప్రభుత్వ ఉద్యోగులని ఇద్దరూ రిటైర్ అయినట్లు చెప్పారు.