అక్కడ వారిని మట్టుబెట్టేశారు: ఒకేసారి నలుగురు: ఏరివేత మరింత దూకుడుగా: కార్డన్ అండ్ సెర్చ్
శ్రీనగర్: భూతల స్వర్గంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న జమ్మూ కాశ్మీర్లో తిష్ట వేసిన ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. అందమైన కాశ్మీరంలో తరచూ దాడులకు పాల్పడుతూ రక్తసిక్తం చేస్తోన్న పాకిస్తాన్ ప్రోత్సాహిత ఉగ్రవాదం పీచమణిచేస్తున్నారు జవాన్లు. కొద్దిరోజులుగా కొనసాగుతోన్న ఈ ఏరివేత.. మరింత వేగం పుంజుకొంది. సోమవారం తెల్లవారు జామున ఏకంగా నలుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు కాల్చి చంపాయి. వారంరోజుల వ్యవధలో భద్రతా బలగాల చేతుల్లో హతమైన ఉగ్రవాదుల సంఖ్య తొమ్మిదికి చేరింది.
ఇటీవల షోపియాన్ జిల్లాలోనే చోటు చేసుకున్న ఎదురుకాల్పుల్లో అయిదుమంది ఉగ్రవాదులు మృతి చెందారు. తాజాగా అదే ప్రాంతంలో మరోసారి ఎన్కౌంటర్ జరిగింది. ఈ సారి నలుగురు ఉగ్రవాదులను హతమార్చారు జవాన్లు. లాక్డౌన్ అమలులో ఉన్న సమయంలోనూ జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల కార్యకలాపాలు కొనసాగడంతో వారిపై నిఘా ఉంచారు. వారి ప్రతి అడుగును నిశితంగా పరిశీలించారు. వారు ఏర్పాటు చేసుకున్న స్థావరాలను పసిగట్టారు. వరుస ఎన్కౌంటర్లతో ఉగ్రవాదుల గుండెల్లో తూటాలను దించుతున్నారు.
జమ్మూ కాశ్మీర్లోని షోపియాన్ జిల్లా పింజోరా ప్రాంతంలో సోమవారం తెల్లవారు జామున భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సరిహద్దు భద్రతా బలగాలు, 44 రెజిమెంట్ జవాన్లు ఉమ్మడిగా షోపియాన్ జిల్లాలోని పింజోరా ప్రాంతంలో శనివారం రాత్రి కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా నలుగురు ఉగ్రవాదులు ఓ భవనంలో నక్కినట్టు పక్కా సమాచారం అందింది. దీనితో వారు ఆ భవనాన్ని చుట్టుముట్టారు. దీన్ని గమనించిన టెర్రరిస్టులు భద్రతా బలగాలపైకి కాల్పులు జరిపారు. దీనితో భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరిపారు.
Recommended Video
ఈ కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతం అయ్యారు. సోమవారం తెల్లవారు జాము వరకూ ఎదురు కాల్పులు కొనసాగాయి. పలు రౌండ్ల పాటు కాల్పులు నిర్వహించినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. నలుగురు ఉగ్రవాదులు దొరకడంతో ఏ ఒక్కర్నీ ప్రాణాలతో వదలకూడదని నిర్ణయించుకున్నామని, ఎన్కౌంటర్ కొనసాగుతోన్న సమయంలోనే పెద్ద ఎత్తున సాయుధ బలగాలను పింజోరాకు తరలించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటిదాకా 80 మంది ఉగ్రవాదులను కాల్చి చంపినట్లు వెల్లడించారు. తమ కార్డన్ అండ్ సెర్చ్ కొనసాగుతుంటుందని స్పష్టం చేశారు.