32 ఎకరాలు కబ్జా: రూ. రెండు వేల కోట్ల ఆస్తి స్వాధీనం
బెంగళూరు: బెంగళూరు నగరంలో శ్రీమంతులు నివాసం ఉండే జేపీ నగరలో కబ్జాకు గురైన రూ. 2,000 కోట్ల విలువైన ఆస్తిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. జేపీ నగర సమీపంలోని సారక్కిచెరువు 82 ఎకరాల విస్తీర్ణంలో ఉండేది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బడా బాబులు ఈ చెరువులోని 32 ఎకరాలు కబ్జా చేశారు.
తరువాత ఫ్లాట్లులుగా తయారు చేసి పలువురికి విక్రయించారు. రూ. లక్షలు చెల్లించి ఇంటి స్థలాలు తీసుకున్న వారు మూడు, నాలుగు, ఐదు అంతస్తుల కట్టడాలు నిర్మించారు. వాణిజ్య కట్టడాలు, రూ. కోట్లు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద అపార్ట్ మెంట్ లు నిర్మించారు. గుడ్డిగా ప్రభుత్వ కట్టడాలు, స్కూలు కట్టారు.
చెరువు కబ్జా అయ్యిందని తెలుసుకున్న ప్రభుత్వం అందరికి నోటీసులు జారీ చేసింది. నాలుగు సంవత్సరాల పాటు కోర్టులో కేసు విచారణ జరిగింది. ఇండ్లు ఖాళీ చెయ్యాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఎవ్వరు ఇండ్లు ఖాళీ చెయ్యలేదు. గురువారం ఉదయం బెంగళూరు జిల్లాధికారి వి. శంకర్ ఆధ్వర్యంలో అక్రమ కట్టడాలు కూల్చి వెయ్యడానికి వెళ్లారు.
800 మంది పోలీసు అధికారులు, సిబ్బంది, 50 జేసీబీలతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 178 నివాస కట్టడాలు, ఆరు ప్రభుత్వ పాఠశాలలు, 7 భారీ అపార్ట్ మెంట్ లు, పీడబ్ల్యు కార్యాలయం, మూడు క్రీడా మైదానాలు నేలమట్టం చేశారు. 32 ఎకరాల విలువ రూ. 2 వేల కోట్లు ఉంటుందని, దానిని స్వాదీనం చేసుకున్నాని బెంగళూరు జిల్లాధికారి వి. శంకర్ తెలిపారు.