హిట్ అండ్ రన్..హైదరాబాద్ హైవే రక్తసిక్తం! పుట్టినరోజు నాడే విషాదం!
బీదర్: కర్ణాటకలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టిన ఘటనలో నలుగురు స్నేహితులు దుర్మరణం పాలయ్యారు. కర్ణాటకలోని బీదర్ జిల్లా హుమ్నాబాద్ తాలూకా పరిధిలోని మంగలగి జాతీయ రహదారిపై శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.
మృతులను సచిన్ హనుమంత, అరుణ్కుమార్ కాశీనాథ, గురునాథ విఠ్ఠల, రఘువీర భీమశ్యాగా గుర్తించారు. ఈ నలుగురూ 18 నుంచి 20 సంవత్సరాల లోపు వారే. ఆత్మీయంగా తిరిగే నలుగురు స్నేహితులూ ఒకేసారి దుర్మరణం పాలు కావడం పట్ల మంగలగిలో విషాదకర వాతావరణం నెలకొంది. మృతుల కుటుంబాలు శోకసముద్రంలో మునిగాయి.
శనివారం సచిన్ హనుమంత పుట్టినరోజు. జన్మదిన వేడుకల్లో పాల్గొన్న నలుగురూ తమ గ్రామం గుండా వెళ్లే.. హైదరాబాద్-పుణే జాతీయ రహదారిపైకి చేరుకున్నారు. రాత్రివేళ హైవేపైకి చేరుకున్న ముచ్చట్లాడుకుంటుండగా.. గుర్తు తెలియని వాహనం అతివేగంగా వారిపైకి దూసుకొచ్చింది. నలుగురినీ ఢీ కొట్టి, ఆగకుండా వెళ్లిపోయింది. ఈ ఘటనలో నలుగురు స్నేహితులు సంఘటనాస్థలంలోనే దుర్మరణం పాలయ్యారు.
ఈ ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు మన్నాఖెళ్లి పోలీస్స్టేషన్కు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్మార్టమ్ స్థానిక ఆసుపత్రికి తరలించారు. హిట్ అండ్ రన్ కింద కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ఆరంభించారు. ఒకేసారి నలుగురు యువకులు మరణించడం గ్రామస్తులను కలచివేసింది.