పరిస్థితి బాగాలేదు: పొరపాటున కూడా అటుగా వెళ్లొద్దు: మేము భారత్ వైపే
న్యూఢిల్లీ: భారత్ లో పర్యటించే తమ దేశ పౌరుల కోసం ఫ్రాన్స్ ప్రభుత్వం ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది. తమ దేశ పర్యాటకులకు హెచ్చరిస్తూ కొన్ని సూచనలు చేసింది. భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో తమ దేశ పౌరులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. జమ్మూకాశ్మీర్ లో పర్యటించే ఫ్రాన్స్ పౌరులు.. పొరపాటున కూడా సరిహద్దు ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించింది.
ఈ మేరకు న్యూఢిల్లీలోని ఫ్రాన్స్ రాయబార కార్యాలయం బుధవారం ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది. ప్రస్తుతం జమ్మూకాశ్మీర్ లో తమ దేశ పౌరులెవరైనా పర్యటిస్తు ఉంటే వెంటనే రాయబార కార్యాలయానికి రావాలని సూచించింది. ముందు జాగ్రత్తచర్యగా ఏ రోజు ఏ ప్రదేశానికి వెళ్తున్నది తమకు తెలియజేయాలని ఫ్రాన్స్ రాయబార కార్యాలయం వెల్లడించింది.
మేము భారత్ వైపే..
భారత్- పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త వాతావరణ పరిస్థితుల్లో తాము భారత్ వైపే మొగ్గు చూపుతున్నామని ఫ్రాన్స్ వెల్లడించింది. తమ దేశంలో ఉగ్రవాదులను, ఉగ్రవాద కార్యకలాపాలను అణచి వేయాల్సిన బాధ్యత పాకిస్తాన్ కు ఉందని హితవు పలికింది. కొన్నేళ్లుగా భారత్.. సరిహద్దు ఉగ్రవాదంపై పోరాడుతోందని పేర్కొంది. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా, దాన్ని అణచివేయడానికి భారత్ పోరాడుతోందని ప్రశంసించింది. ఉగ్రవాదులపై పోరాటంలో భాగంగా.. భారత్ ప్రపంచ దేశాల మద్దతును కూడగట్టుకుందని ఫ్రాన్స్ వెల్లడించింది.
చర్చలతో పరిష్కారాన్ని వెదుక్కోవాలి..
రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణాన్ని నియంత్రించుకోవడానికి చర్చలే ఏకైక మార్గమని ఫ్రాన్స్ రాయబార కార్యాలయం సూచించింది. ద్వైపాక్షిక చర్చలతో సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఉగ్రవాద సంస్థ జైషె మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ ను మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ గా గుర్తించడానికి తమవంతు సహాయం అందిస్తామని ఫ్రాన్స్ ఇదివరకే వెల్లడించిన విషయం తెలిసిందే.