గోవా ట్విస్ట్: డిసౌజా హెచ్చరిక, తిరుగుబాటుకు రెడీ
పానాజా: మనోహర్ పారికర్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, కేంద్ర మంత్రి పదవి చేపట్టనున్న నేపథ్యంలో గోవా బిజెపి రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. గోవా ముఖ్యమంత్రిగా మనోహర్ పారికర్ వారసుడు ఎవరన్న దానిపై చెలరేగుతున్న వివాదం గోవా బిజెపిలో తిరుగుబాటుకు దారితీస్తోంది. తనకు ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టని పక్షంలో రాజీనామా చేస్తానంటూ ఉప ముఖ్యమంత్రి ఫ్రాన్సిస్ డిసౌజా హెచ్చరించడంతో పరిస్థితి వేడెక్కింది.
తానే ముఖ్యమంత్రి పదవికి తగిన అభ్యర్థినని స్పష్టం చేసిన ఆయన తనకంటే జూనియర్ అయిన ఆరోగ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్కు ఈ పదవిని కట్టబెడితే ఎంతమాత్రం కొనసాగేది లేదని స్పష్టం చేశారు. డిసౌజాకు పది మంది శానససభ్యులు మద్దతు ఇస్తున్నట్లు సమాచారం. డిసౌజా కోసం రాజీనామా చేయడానికి వారు సిద్ధపడినట్లు చెబుతున్నారు.
కేంద్రంలో రక్షణ మంత్రిగా నియమితులు కావచ్చని భావిస్తున్న మనోహర్ పారికర్ స్థానంలో గోవా ముఖ్యమంత్రి పదవికోసం పోటీ శుక్రవారం తీవ్రమైన నేపథ్యంలో రాష్ట్ర ఆరోగ్య మంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ పోటీలో అందరికన్నా ముందున్నట్లు తెలుస్తోంది.శనివారం న్యూఢిల్లీలో బిజెపి పార్లమెంటు సమావేశం తర్వాత ప్రస్తుత ముఖ్యమంత్రి పారికర్ తన పదవికి రాజీనామా చేయనున్నారు. అదే రోజు పారికర్ వారసుడిని ఎంపిక చేయడానికి పనాజిలో బిజెపి లెజిస్లేచర్ పార్టీ సమావేశం జరుగుతుంది.
కొత్త ముఖ్యమంత్రి పదవికోసం పేర్లను పరిశీలించడం కోసం శుక్రవారంపార్టీ శాసన సభ్యుల కీలక సమావేశం జరిగింది. సమావేశంలో కొత్త ముఖ్యమంత్రి పదవికి ముగ్గురి పేర్లు ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్, అసెంబ్లీ స్పీకర్ రాజేంద్ర అర్లేకర్, డిప్యూటీ ముఖ్యమంత్రి ఫ్రాన్సిస్ డిసౌజాను తుది వడపోత తర్వాత ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే పేర్లను వెల్లడించడానికి పారికర్ నిరాకరిస్తూ జాబితాను బిజెపి పార్లమెంటరీ బోర్డుకు సమర్పిస్తామని, బోర్డు తుది నిర్ణయం తీసుకుంటుందని మనోహర్ పారికర్ చెప్పారు.
కాగా, ముఖ్యమంత్రి పదవికి పోటీలో పర్సేకర్ అందరికన్నా ముందున్నారని శుక్రవారం పొర్వోరియంలో సమావేశమైన బిజెపి లెజిస్లేటర్లు సూచనప్రాయంగా తెలియజేసారు. అయితే ఎవరూ అధికారికంగా చెప్పడానికి ముందుకు రాలేదు. ముఖ్యమంత్రి పదవికి మీరు పోటీలో ఉన్నారా అని అడగ్గా, పార్టీలో ఎలాంటి పోటీ లేదని, పార్టీ తనకు అప్పగించిన విధులను తాను నెరవేరుస్తున్నానని చెప్పారు. కాగా, పార్టీ తనకు అప్పగించే ఏ బాధ్యతనైనా తాను నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నానని అర్లేకర్ చెప్పారు.
ముఖ్యమంత్రి పదవికి ఉప ముఖ్యమంత్రి డిసౌజాను ఎంపిక చేయాలని మరో పార్టీ శాసన సభ్యుడు మైకేల్ లోబో అంటూ, అలా చేస్తే బిజెపి మైనారిటీలకు వ్యతిరేకం కాదన్న మంచి సంకేతాన్ని అది పంపిస్తుందని అన్నారు.