నీరవ్ మోసం-పీఎన్బీ స్కాం: 'నిధులు లేకపోతే మీ ఆస్తులు అమ్మేయండి'
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ.11వేల కోట్లకు పైగా ముంచి, దేశం విడిచి పారిపోయిన నీరవ్ మోడీకి ఆ బ్యాంకు ఓ ఆఫర్ ఇచ్చింది. మోసపూరితంగా తీసుకున్న లెటర్ ఆఫ్ అండర్ టేకింగ్ (ఎల్వోయూ)ల ద్వారా తమ శాఖలకు జరిగిన నష్టాలను పూడ్చేందుకు సమగ్ర, అమలు చేయతగిన ప్లాన్తో తిరిగి రావాలని చెప్పింది.
చదవండి: నా ఫ్యామిలీకి సంబంధంలేదు: నీరవ్, హైదరాబాద్ ఆస్తులపైనా తిరకాసు! అసలు ఉద్దేశ్యం ఇదీ!!
తాను అప్పులు చెల్లించే స్థితిలో లేనని, తన పరువు తీశారని నీరవ్ మోడీ బ్యాంకుకు లేఖలు రాసిన విషయం తెలిసిందే. తాను తీసుకున్న మొత్తాని కంటే ఎక్కువ అప్పు చూపిస్తున్నారని ఆరోపించాడు. అంతేకాదు, జీతాలు చెల్లించలేనని, మీరు వేరే ఉద్యోగం చూసుకోవాలని తన కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగులకు మెయిల్ ద్వారా లేఖ రాశాడు.
పీఎన్బీ లేఖ ఇలా
తన పరువును బజారుకీడ్చారన్న నీరవ్ మోడీ లేఖకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్పందించింది. బ్యాంకులోని కొందరు అధికారుల ద్వారా మోసపూరితంగా, అన్యాయంగా మీరు ఎల్వోయూలు పొందారని, మీ మూడు భాగస్వామ్య సంస్థలకు మేమిప్పుడు అవకాశాలు పొడిగించే స్థితిలో లేమని పీఎన్బీ జనరల్ మేనేజర్ (అంతర్జాతీయ బ్యాంకింగ్ విభాగం అశ్విన్ వత్స్.. నీరవ్ మోడీకి బదులిచ్చారని తెలుస్తోంది.
అలా తిరిగి రాగలరా
మీరు తీసుకున్న అప్పులు చెల్లించేందుకు గడువులు పొడగించేందుకు మేం సహకరించలేమని, అయితే అప్పులు చెల్లించేందుకు మీరు ఏదైనా అమలు చేయగల సమగ్ర ప్రణాళికతో రాగలరా అని, అలా అయితే తమకు తిరిగి మెయిల్ చేయాలని బ్యాంకు నీరవ్ మోడీకి మెయిల్ చేసింది.
కంపెనీ ఆస్తులు అమ్మండి
ఇదిలా ఉండగా, పంజాబ్ నేషనల్ బ్యాంకులో నీరవ్ మోడీ తన చీటింగ్ను పదేళ్ల క్రితమే ప్రారంభించాడని తెలుస్తోంది. మరోవైపు, బకాయిలు పడ్డ బ్యాంకర్లకు చెల్లించేందుకు తమ వద్ద నిధులు లేవని రూ.ఆరువేల కోట్లు మాత్రమే చెల్లిస్తామని పీఎన్బీ చేతులెత్తేసింది. దీనిపై ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు స్పందించారు. ఒకవేళ మీ దగ్గర నిధులు లేకపోతే కంపెనీకి చెందిన నాన్ కోర్ ఆస్తులను అమ్మకానికి పెట్టి నిధులు సమకూర్చాలని సూచించారు.
ఆ ఆఫీస్ అమ్మే యోచనలో
రుణ అవసరాల కోసం మేము మీకు ఈక్విటీని అందించామని, ఇప్పుడు బకాయిలు చెల్లించేందుకు మీ దగ్గర నిధులు లేకపోతే నాన్ కోర్ ఆస్తులను అమ్మి నగదు సమకూర్చుకోవాలని సదరు అధికారి స్పష్టం చేశారు. మ్యూచువల్ ఫండ్ వ్యాపారం కోసం ఆ బ్యాంకు దక్షిణ ఢిల్లీలోని మెయిన్ ఆఫీస్ను అమ్మాలని యోచిస్తోందని తెలుస్తోంది.