నా ఉద్దేశం అది కాదు.. క్షమించండి: "ఫ్రీ కశ్మీర్" పోస్టర్ పై వివరణ ఇచ్చిన యువతి
ముంబై: జేఎన్యూ ఘటనపై ముంబైలో జరిగిన నిరసనల్లో భాగంగా కశ్మీర్కు విముక్తి కావాలంటూ ఫ్లకార్డు ప్రదర్శించిన మెహక్ మీర్జా ప్రభు అనే యువతి తీరుపై బీజేపీ విమర్శలు గుప్పించింది. అంతేకాదు ఆమెను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పలు పోస్టులు కూడా వస్తుండటంపై మీర్జా స్పందించింది. ఫేస్బుక్లో ఓ వీడియోను పోస్టు చేసింది. సోమవారం ఫ్రీ కశ్మీర్ పోస్టర్ను తాను ప్రదర్శించడం వెనక ఎలాంటి దురుద్దేశం లేదని వివరణ ఇచ్చింది. తన ఉద్దేశం వేరని అది వక్రీకరించి చూడడం సరికాదని పేర్కొన్నారు.
ముంబై నిరసనల్లో "కశ్మీర్కు విముక్తి" పోస్టర్ కలకలం... మండిపడ్డ బీజేపీ
నిరసనలు జరిగే చోట వివిధ అంశాలకు సంబంధించి ఫ్లకార్డులు తయారు చేస్తున్నారని ఇందులో సీఏఏ, ఎన్ఆర్సీ, జేఎన్యూ, ఫ్రీ కశ్మీర్ స్లోగన్లు కలిగి ఉన్న ఫ్లకార్డులు ఉన్నాయని తెలిపింది. అందులో ఫ్రీ కశ్మీర్ ఫ్లకార్డు తీసుకున్నట్లు చెప్పిన మీర్జా.... కశ్మీర్లో ఇంటర్నెట్, మొబైల్ సేవలను తిరిగి పునరుద్ధరించాలని మాత్రమే తాను కోరానని మీర్జా చెప్పింది. అంతేకాదు తను కశ్మీర్కు చెందిన యువతిని కూడా కాదని స్పష్టం చేసింది. తను ముంబైకి చెందిన అమ్మాయినని చెప్పుకొచ్చింది. తనపై తప్పుగా వస్తున్న వార్తలను ఆమె ఖండించింది. ఫ్రీ కశ్మీర్ స్లోగన్ ఉన్న ఫ్లకార్డును చూసినప్పుడు కశ్మీర్లో రాజ్యాంగ హక్కుల అంశం తనకు తట్టిందని చెప్పింది.
తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారం తనకు ప్రమాదకరంగా మారే అవకాశం ఉందనే భయాన్ని మీర్జా వ్యక్తం చేసింది. ఒక అమ్మాయి భయంతో బతకాలా అంటూ ప్రశ్నించింది. ఈ వీడియోను నెటిజెన్లు షేర్ చేయాలంటూ విజ్ఞప్తి చేసింది మీర్జా. కశ్మీర్లో ఇంటర్నెట్, మొబైల్ సేవలను పునరుద్ధరించాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారని అందులో తాను కూడా ఒకరినని చెప్పింది మీర్జా. ప్రాథమిక రాజ్యాంగ హక్కులపైనే తాను ప్రశ్నించినట్లు చెప్పింది మీర్జా. అంతే తప్ప ఫ్లకార్డు ప్రదర్శించడం వెనక ఎలాంటి దురుద్దేశాలు లేవని స్పష్టం చేసింది. ఒకవేళ తను ప్రదర్శించిన ఫ్లకార్డు వల్ల ఎవరైనా బాధపడి ఉంటే తనను క్షమించాల్సిందిగా కోరింది. మానవుల పట్ల జాలి దయ చూపాలని విజ్ఞప్తి చేసింది. ద్వేషంపై ప్రేమ విజయం సాధించాలని వీడియోలో కోరింది.
ఇదిలా ఉంటే ఫ్లకార్డు ప్రదర్శించిన మెహక్ మీర్జా ప్రభు కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆమెను పట్టుకుని విచారణ చేస్తామని చెబుతున్నారు.అసలు ఆ ఫ్లకార్డు పట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందనే కోణంలో కూడా ఆమెను విచారణ చేస్తామని చెప్పారు. ఈ క్రమంలోనే సోమవారం ముంబైలో జరిగిన నిరసన కార్యక్రమంకు సంబంధించిన వీడియో ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు.