నో టికెట్, ఫ్రీ జర్నీ.. మెట్రోలో, బస్సుల్లో ఉచిత ప్రయాణం.. రాఖీ కానుక..!
ఢిల్లీ : రక్షా బంధన్.. పేరులోనే మహత్తు దాగుంది. నాకు నీవు రక్ష.. నీకు నేను రక్ష అంటూ అన్నాదమ్ములకు అక్కాచెళ్లెల్లు రాఖీ కట్టే పండుగ విశేషం అంతా ఇంతా కాదు. అనుబంధాలకు, ప్రేమానురాగాలకు ప్రతీకగా నిలుస్తోంది రాఖీ పౌర్షమి. అన్నాదమ్ములకు రాఖీలు కట్టే అక్కాచెళ్లెల్లకు కానుకలు ఇస్తూ పరస్పరం ఆనందోత్సాహాల మధ్య జరిగే రక్షా బంధన్ సంబరం వెలకట్టలేనిది. ఆ క్రమంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆడపడుచులకు వరాల జల్లు కురిపించారు. ఇకపై మెట్రోతో పాటు ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందిస్తూ మహిళలకు రాఖీ కానుక అందించారు.
"భాయ్ దూజ్".. ఇకపై ఫ్రీ జర్నీ.. ఆడపడుచులకు కానుక..!
ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ మహిళలకు రక్షా బంధన్ కానుక ప్రకటించారు. "భాయ్ దూజ్" పేరుతో మహిళలకు ఇకపై ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ మెట్రోతో పాటు ఢిల్లీ ట్రాన్స్పోర్టు కార్పొరేషన్ నడిపే బస్సుల్లో మహిళలు ఫ్రీగా ప్రయాణించడానికి వీలుగా కొత్త పథకం ప్రకటించారు. అక్టోబర్ 29వ తేదీ నుంచి ఉచిత ప్రయాణం అమల్లోకి వస్తుందని తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో మువ్వన్నెల జెండా ఆవిష్కరించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఫ్రీ జర్నీకి సంబంధించిన వివరాలు వెల్లడించారు.
ఢిల్లీలో మహిళలకు బస్సు జర్నీ ఫ్రీగా ఇవ్వాలని చాలా రోజుల కిందటే ప్రతిపాదనలు సిద్ధం చేశారు అర్వింద్ కేజ్రీవాల్. అందులోభాగంగా రక్షా బంధన్ సందర్భాన్ని పురస్కరించుకుని గురువారం నాడు అనౌన్స్ చేశారు. ఫ్రీ జర్నీ ఫెసిలిటీ అక్టోబర్ 29వ తేదీ నుంచి అమలవుతుందని ప్రకటించారు. అదలావుంటే రక్షా బంధన్ నాడు మహిళలకు డీటీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు.
టీడీపీ,
వైసీపీ
డిష్యుం
డిష్యుం..
జెండా
పండుగ
వేళ
చీరాలలో
ఉద్రిక్తత..!
రాఖీ కానుక.. అక్టోబర్ 29 నుంచి.. జర్నీ ఫ్రీ..!
రక్షా బంధన్ సందర్భంగా ఢిల్లీలోని సోదరీమణులకు కానుక ఇవ్వాలనుకున్నానని.. ఆ మేరకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నానని మీడియాకు వెల్లడించారు కేజ్రీవాల్. ఎప్పటినుంచో ప్రతిపాదనలకే పరిమితం అయినప్పటికీ.. ఇవాళ దాన్ని అమలు చేసేందుకు కంకణం కట్టుకున్నానని వివరించారు. ఆ క్రమంలో అక్టోబర్ 29 నుంచి ఢిల్లీ మెట్రో రైళ్లతో పాటు, ఢిల్లీ ట్రాన్స్పోర్టు కార్పొరేషన్ బస్సులు, క్లస్టర్ బస్సుల్లో ఫ్రీ జర్నీ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు.
మహిళల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు వెల్లడించారు కేజ్రీవాల్. అయితే ఢిల్లీ ప్రభుత్వంపై అదనంగా 700 కోట్ల రూపాయల భారం పడుతున్నప్పటికీ.. ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నామని చెప్పుకొచ్చారు. అదలావుంటే ఢిల్లీ మెట్రోలో కేంద్ర ప్రభుత్వానిది 50 శాతం షేర్ ఉంటే.. ఢిల్లీ ప్రభుత్వానిది మరో సగం ఉందని తెలిపారు. అయితే మెట్రో రైళ్లల్లో మహిళలకు ఫ్రీ జర్నీ అవకాశం కల్పిస్తే కేంద్రానికి రావాల్సిన మొత్తాన్ని ఇక ఢిల్లీ స్టేట్ గవర్నమెంట్ చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
ఎన్నికల స్టంటా.. క్యా హై మత్లబ్..!
మొన్నటి లోక్సభ ఎన్నికల వేళ అర్వింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ బొక్కాబొర్లా పడింది. ఘోర పరాభవం ఎదురుకావడంతో ఆ పార్టీ చీఫ్ కేజ్రీవాల్ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించినట్లు కనిపిస్తోంది ప్రస్తుత వ్యవహారం. ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు కూడా సమయం దగ్గర పడుతుండటంతో ఓటు బ్యాంకును పదిలం చేసుకునే పనిలో పడ్డారనే వాదనలున్నాయి.
అందుకే మహిళా ఓటర్లను ఆకర్షించడానికే ఇలాంటి ఫ్రీ జర్నీ పథకం తెరపైకి తెచ్చారనే ప్రచారం జోరందుకుంది. ఏదిఏమైనా రాఖీ కానుకగా ఫ్రీ జర్నీ అంటూ అర్వింద్ కేజ్రీవాల్ తీసుకున్న నిర్ణయంపై ఢిల్లీ మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు కరెంట్ సరఫరాలో కూడా నయా స్కీమ్ తేవడం ఎన్నికల స్టంట్ అంటూ కొట్టిపారేస్తున్నాయి విపక్షాలు.