మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణించే పథకానికి శ్రీకారం
ఢిల్లీ: మరి కొన్ని నెలల్లో ఢిల్లీకి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ కేజ్రీవాల్ సర్కార్ అప్పుడు తాయిలం వేసింది. మహిళలను ఆకట్టుకునేందుకు కేజ్రీ సర్కార్ ఢిల్లీ ట్రాన్స్పోర్టు కార్పోరేషన్ (డీటీసీ) బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే పథకానికి శ్రీకారం చుట్టింది. మంగళవారం రోజున ఈ పథకం ప్రారంభమైంది. భాయ్ దూజ్ పర్వదినాన ఈ పథకం ప్రారంభం కావడం సంతోషంగా ఉందని డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అన్నారు.
ఇక ఈ పథకం వినియోగించుకునే మహిళలకు ముందుగా పింక్ టికెట్లను డీటీసీ సరఫరా చేస్తోంది. ఈ పింక్ టికెట్ల ద్వారా వారు ఢిల్లీ రవాణా సంస్థకు చెందిన బస్సుల్లో ఉచితంగా ప్రయాణించొచ్చని ప్రభుత్వం తెలిపింది.
#BhaiDooj - The day has finally arrived!
— AAP (@AamAadmiParty) October 29, 2019
Women in Delhi can now TRAVEL FREE and TRAVEL SAFE in our DTC and Cluster Buses.
A huge leap towards gender equality as this ensures both the women's safety and increase in the mobility of women across Delhi to pursue education and jobs pic.twitter.com/cgJWSib8wC
ఇక ఎన్ని పింక్ టికెట్లు అయితే జారీ అయ్యాయో అంత డబ్బులను ఢిల్లీ రవాణా సంస్థకు ప్రభుత్వం చెల్లించనున్నట్లు డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా వెల్లడించారు. ఈ పథకంతో మహిళలు సురక్షితమైన ప్రయాణాలు చేయడమే కాకుండా ఢిల్లీ ఆర్థికాభివృద్ధిలో మహిళల పాత్రను మరింత ఇనుమడింప చేస్తుందని సిసోడియా అభిప్రాయపడ్డారు. మంగళవారం నుంచి ఈ ఉచిత ప్రయాణ పథకం ప్రారంభం అవుతుందని ఢిల్లీ సర్కార్ సోమవారం రాత్రి అధికారిక ప్రకటన విడుదల చేసింది.
మహిళలకు ఉచిత ప్రయాణంకు సంబంధించిన పథకం నోయిడా-ఎన్సీఆర్ ప్రాంతాలకు కూడా వర్తిస్తుందని ఢిల్లీ సర్కార్ స్పష్టం చేసింది. విమానాశ్రయంతో పాటుగా డీటీసీ బస్సులు ఎక్కడెక్కడైతే ఆపరేట్ అవుతున్నాయో అక్కడంతా మహిళా ప్రయాణికులు ఉచితంగా ప్రయాణించొచ్చని కేజ్రీ ప్రభుత్వం స్పష్టం చేసింది.
స్వాంతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఈ పథకం ప్రారంభిస్తామని చెప్పారు. ఆగష్టు 29న జరిగిన ఢిల్లీ కేబినెట్ సమావేశంలో మహిళలకు ఉచిత ప్రయాణం పథకానికి ఆమోదం తెలిపారు. అయితే ఢిల్లీ ప్రభుత్వ మహిళా ఉద్యోగిణులు, ఈ ఉచిత పథకం వినియోగించుకున్నట్లయితే వారికి ట్రావెల్ అలవెన్సులు ఉండవని స్పష్టం చేసింది ప్రభుత్వం.