ఫ్రీడమ్ 251 స్మార్ట్ ఫోన్ల బుకింగ్ షాక్, కొత్త కష్టం!
న్యూఢిల్లీ: ఫ్రీడం 251 ఫోన్ల బుకింగ్ శుక్రవారం నాడు తిరిగి ప్రారంభించినట్లు రింగింగ్ బెల్స్ కంపెనీ వెల్లడించింది. గురువారం ఫోన్ల కోసం విపరీతమైన డిమాండ్ రావడంతో సంస్థ వెబ్సైట్ క్రాష్ అయింది. డిమాండ్ అధికంగా వస్తుండడంతో తాత్కాలికంగా ఫోన్ల బుకింగ్లు ఆపేస్తున్నట్లు కంపెనీ నిన్న వెల్లడించారు.
రూ.251కి స్మార్ట్ఫోన్ ఫోన్ అందిస్తామని నోయిడాకు చెందిన రింగింగ్ బెల్స్ కంపెనీ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్గా మారింది. గురువారం ఫ్రీడం 251 ఫోన్ బుక్ చేయడానికి వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు.
ఫోన్ కొనడానికి 'బై' బటన్ ప్రెస్ చేస్తే తిరిగి షిప్పింగ్ వివరాలు అడుగుతోందని పలువురు సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టారు. దీంతో నిన్న బుకింగ్లు నిలిపేసినట్లు ప్రకటించారు. తిరిగి శుక్రవారం బుకింగ్స్ ప్రారంభించారు. ఫోన్ బుక్ చేస్తే నాలుగు నెలల తర్వాత అందజేస్తామని చెబుతున్నారు.
గురువారం దాదాపు సెకునుకు 6 లక్షల లైక్స్ వస్తున్నాయట. అంటే ఈ ఫోనును బుక్ చేసుకోవడం కోసం ఎంతలా ప్రయత్నిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. శుక్రవారం మధ్యాహ్నం వరకు 30వేల బుకింగ్స్ పూర్తయినట్లుగా తెలుస్తోంది. రెండో రోజు కూడా వెబ్ సైట్ ఓ సారి క్రాష్ కావడం గమనార్హం.
అయితే, ఈ సంస్థకు కొత్త కష్టం వచ్చిందట. వినియోగదారుల డిమాండుకు తగినట్లు ఫోన్లను అందించే శక్తిలేక బ్యాంకుల నుంచి ఆర్థిక సాయం కోరినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రింగింగ్ బెల్స్ కంపెనీ సిమ్ కార్డును కూడా రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఈ సిమ్ కార్డు పేరు బెల్స్. జూన్ లోపు ఈ కంపెనీ దాదాపు 50 లక్షల స్మార్ట్ ఫోన్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుందని తెలుస్తోంది.