కన్నయ్యకు 15ఏళ్ల బాలిక సవాల్(వీడియో)
లూధియానా : జాతి వ్యతిరేక నినాదాల చేసిన కేసులో నిందితుడైన జేఎన్యూ విద్యార్థి నేత కన్నయ్య కుమార్పై ఓ 15ఏళ్ల బాలిక ఆగ్రహం వ్యక్తం చేసింది. భావ ప్రకటన స్వేచ్ఛపై బహిరంగ చర్చకు రావాలని కన్నయ్యకు ఝాన్వీ బెహల్(15) సవాల్ విసిరింది. ప్రజలు ఎన్నుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చే ముందు బాగా ఆలోచించుకోవాలని సూచించింది.
మోడీని దూషించడం మానుకోవాలని హితవు పలికింది. డీఏవీ పబ్లిక్ స్కూల్ విద్యార్థిని అయిన ఝాన్వీ స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఉంటుంది. రక్షా జ్యోతి ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థలో ఆమె క్రియాశీలక సభ్యురాలు. స్వచ్ఛ భారత్ అభియాన్తో పాటు అనేక ప్రాజెక్టుల్లో ఆమె అందించిన సేవలకు గుర్తింపుగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆమెను ప్రభుత్వం సన్మానించింది.
ఝాన్వీ మాట్లాడుతూ.. రాజ్యాంగం మనకు భావ ప్రకటన స్వేచ్ఛను ఇచ్చిందని, అయితే పరిమితులను దాటవచ్చని దాని అర్థం కాదని చెప్పారు. కన్నయ్య కుమార్తో పాటు కొందరు ఆ ప్రాథమిక హక్కును తమ రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తున్నారన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో జేఎన్యూలో జరిగిన సంఘటన ఏ భారతీయుడూ సహించగలిగేది కాదన్నారు.
పాకిస్థాన్ స్పాన్సర్ చేస్తున్న ఉగ్రవాదులతో పోరాడుతూ సైనికులు త్యాగాలు చేస్తూ ఉంటే.. విద్యార్థులు భారత వ్యతిరేక నినాదాలు చేస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థి నేతలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం బురద జల్లే కార్యక్రమంలో నిమగ్నమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
భారతదేశ ప్రజలు ఎన్నుకున్న ప్రధాన మంత్రిని దూషిస్తూ మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి చర్యల వల్ల ప్రపంచంలో భారతదేశానికి ఉన్న పరువు ప్రతిష్ఠలు దెబ్బతింటాయన్నారు. ఝాన్వీ బెహల్ గతంలో కూడా అనేక ప్రజా సమస్యలపై పోరాడారు.
సామాజిక సంబంధాల వెబ్సైట్లలో పెద్దల చిత్రాలు, అశ్లీలతపై నిషేధం విధించాలంటూ ఇటీవలే పంజాబ్, హర్యానా హైకోర్టులో రిట్ దాఖలు చేశారు. కోర్టుకు స్కూలు యూనిఫారం ధరించి వెళ్లారు. హైకోర్టు తీర్పు ఆమెకు అనుకూలంగానే వచ్చింది. వివిధ సంఘాలు రాస్తా రోకోలు చేస్తుండటంపై కూడా ఆమె కోర్టును ఆశ్రయించారు.
WATCH: 15-yr old student from Ludhiana, Jhanvi Behal challenges #KanhaiyaKumar for an open debate.https://t.co/QYegTs1zdk
— ANI (@ANI_news) March 6, 2016