రైల్లో షారుక్ ఖాన్ను చెంపదెబ్బ కొట్టిన మహిళ!
ముంబై: బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ సోమవారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మౌనంగా ఉండటం కూడా భావప్రకటనా స్వేచ్ఛనే అని వ్యాఖ్యానించారు. షారుక్ ఖాన్ నటించిన ఫ్యాన్ చిత్రం ట్రయలర్ విడుదల సందర్భంగా ముంబైలో ఓ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా.. అసహనంపై మీ అనుభవం ఎలా ఉందని మీడియా ప్రశ్నించింది. దానికి షారుక్ ఖాన్ ఆసక్తికర సమాధానం చెప్పారు. మౌనంగా ఉండటం కూడా భావప్రకటనా స్వేచ్ఛ కిందకే వస్తుందని వ్యాఖ్యానించారు.
కాగా, భారత్లో అసహనం పెరిగిందంటూ గత ఏడాది కొందరు తమ అవార్డులు, పురస్కారాలు వెనక్కి ఇచ్చిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో షారుక్ ఖాన్ తన పుట్టినరోజున భారత్లో అసహనం పెరిగిపోతోందని వ్యాఖ్యానించారు. దీనిపై ఆయనపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అంతేకాదు, ఆ తర్వాత విడుదలైన ఆయన చిత్రం దిల్ వాలే పైనా ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన దానిపై మౌనంగా ఉంటున్నారు.
షారుక్ను చెంపదెబ్బ కొట్టిన మహిళ
ముంబై తొలిసారి వచ్చినప్పుడు రైల్లో తనకు ఎదురైన వింత అనుభవం గురించి షారుక్ ఖాన్ స్వయంగా అభిమానులతో పంచుకున్నాడు. అవగాహన లేక రైళ్లో తాను చేసిన పనికి ఆ మహిళ తన చెంప పైన కొట్టిందని చెప్పాడు.
రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు తాను రిజర్వ్ చేసుకున్న బెర్త్ పైన మగాళ్లను ఎవర్నీ కూర్చోనివ్వలేదట షారుక్ ఖాన్. ఇది నా సీటు.. నేను రిజర్వ్ చేసుకున్నానని ఆమెతో వాగ్వాదానికి దిగాడట. ఇంతలో బోగీలోకి వచ్చిన ఓ మహిళను ఉద్దేశించి మీరు కూర్చోవచ్చు కానీ మగాళ్లు కూర్చోవద్దని సీటు ఆఫర్ చేశాడట.
దీంతో ఆగ్రహానికి గురైన ఆమె.. ఇది నీదు కాదు, అందరిదీ అంటూ లాగి చెంప పైన కొట్టిందట. తాను ఎక్కిన రైలు ముంబై నగరంలోకి అడుగుపెట్టిన తర్వాత లోకల్ ట్రెయిన్గా మారుతుందనే విషయంలో అప్పట్లో తనకు తెలియదని.. మొదటిసారి ముంబై వచ్చినప్పటి అనుభవాలను గుర్తు చేసుకున్నాడు.