మమతా బెనర్జీకి వరుస షాక్లు: టీఎంసీకి మరో ఎమ్మెల్యే గుడ్బై, 24గంటల్లో నలుగురు నేతలు
కోల్కతా: పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల దగ్గరపడుతున్న వేళ టీఎంసీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వరుస షాక్లు తగులుతున్నాయి. రెండ్రోజుల వ్యవధిలో ముగ్గురు ఎమ్మెల్యేలు తృణమూల్ కాంగ్రెస్ పార్టీని వీడటం గమనార్హం. ఇప్పటికీ కేలక నేత, ఎమ్మెల్యే సువేందు అధికారి, మరో ఎమ్మెల్యే జితేంద్ర తివారీ టీఎంసీ పార్టీతోపాటు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశారు.
ఎన్నికల వేళ: మమతా బెనర్జీకి మరో షాక్: సువేందు అధికారితోపాటు మరో ఎమ్మెల్యే రాజీనామా, బీజేపీలోకి!
మమతా బెనర్జీకి మరో ఎమ్మెల్యే షాక్..
తాజాగా, బరాక్పోర్ ఎమ్మెల్యే శీల్భద్ర దత్తా టీఎంసీకి గుడ్ బై చెప్పారు. ఈ మేరకు పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి ఈ మెయిల్ ద్వారా రాజీనామా పంపారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాను పార్టీలో ఉండటం సరికాదని అన్నారు. అయితే, ఎమ్మెల్యే పదవి నుంచి వైదొలగనని.. ఎందుకంటే తాను ప్రజల ఓట్లతో గెలిచానని స్పష్టం చేశారు.
టీఎంసీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ నిర్ణయాలను శీల్ భద్ర దత్తా గత కొంత కాలంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు.
24గంటల్లోనే టీఎంసీకి నలుగురు నేతలు గుడ్ బై..
కాగా, పార్టీ నేతలు దత్తాను బుజ్జగించేందుకు ప్రయత్నించినా.. ఫలించలేదు. మొదట సువేందు అధికారి, ఆ తర్వాత జితేంద్ర తివారీ, ఇప్పుడు దత్తా కూడా టీఎంసీకి షాకిచ్చారు. వీరంతా బీజేపీలో చేరితే మాత్రం మమతా బెనర్జీ విజయావకాశాలపై ప్రతికూల ప్రభావం తప్పదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇదిఇలావుంటే, మైనార్టీ సెల్ నేత కబీరుల్ ఇస్లాం కూడా టీఎంసీని వీడారు. 24 గంటల్లోనే నలుగురు నేతలు టీఎంసీని వీడటం రాజకీయ వేడినిపుట్టిస్తున్నాయి.
బీజేపీలో చేరనున్న టీఎంసీ కీలక నేతలు
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో ఈ వరుస పరిణామాలు మమతా బెనర్జీకి ఆందోళన కలిగిస్తున్నాయి. మరోవైపు బీజేపీ.. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఈసారి అధికారంలోకి రావాలని శాయశక్తులా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతోపాటు కేంద్రమంత్రులు రాష్ట్రంలో ప్రచారం ప్రారంభించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా టీఎంసీని వీడిని సువేందు అధికారి బీజేపీలో చేరతారని తెలుస్తోంది. ఆయనతోపాటు టీఎంసీని వీడిని జితేంద్ర తివారీ, శల్ భద్ర దత్తా కూడా బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. టీఎంసీలో అగ్రనేతగా ఎదిగిన సువేందు అధికారి బీజేపీలో చేరితే మాత్రం కాషాయ పార్టీ విజయావకాశాలు మెరుగుపడనున్నాయి. సుమారు 50 స్థానాల్లో సువేందు అధికారి తన ప్రభావాన్ని చూపగలరని రాజకీయ పండితులు అంటున్నారు.