సరిపోలేదు రండి: మంత్రి, శరత్ కుమార్ కు మళ్లీ సమన్లు: రావాల్సిందే, ఫిక్స్!
చెన్నై: ఆదాయపన్ను శాఖ అధికారులు తమిళనాడు ఆరోగ్య శాఖా మంత్రి విజయభాస్కర్ కు మళ్లీ చుక్కలు చూపించడానికి సిద్దం అయ్యారు. ఇంతకు మందు సమన్లు జారీ చెయ్యడంతో మంత్రి విజయభాస్కర్ ఐటీ శాఖ అధికారులు ముందు విచారణకు హాజరై వివరణ ఇచ్చారు.
అయితే ఆయన ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందిన ఐటీ అధికారులు మరోసారి శుక్రవారం మంత్రి విజయభాస్కర్ కు కొత్తగా సమన్లు జారీ చేశారు. పనిలోపనిగా మంత్రి విజయభాస్కర్ తో సహ సమతువ మక్కల్ కట్చి పార్టీ వ్యవస్థాపకుడు, నటుడు శరత్ కుమార్, ఎంజీఆర్ వైద్య విశ్వవిద్యాలయం ఉపకులపతి గీతాలక్ష్మీలకు సమన్లు జారీ చేశారు.
లాభం లేదు, సరిపోలేదని
మంత్రి విజయభాస్కర్, శరత్ కుమార్, గీతాలక్ష్మి ఇచ్చిన వివరణతో పూర్తి వివరాలు బయటపడలేదని సమాచారం. అందుకే వారికి మళ్లీ సమన్లు జారీ చేసి ఈనెల 17వ తేదీన విచారణకు హాజరు కావాలని ఐటీ శాఖ అధికారులు సూచించారు.
రూ. 89 కోట్ల బట్వాడా విషయం
ఆర్ కే నగర్ ఉప ఎన్నిల సందర్బంగా టీటీవీ దినకరన్ కు ఓటు వెయ్యాలని స్థానిక ఓటర్లకు రూ. 89 కోట్ల బట్వాడా ఇచ్చారని ఐటీ శాఖ ఆధారాలు సేకరించింది. ఈ విషయం అంత సులువుగా వదిలిస్తే మంచిదికాదని అధికారులు నిర్ణయించారని సమాచారం.
శరత్ కుమార్ కు సినిమా కష్టాలు
ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేసిన టీటీవీ దినకరన్ కు మద్దతు తెలపడానికి శరత్ కుమార్ రూ. 7 కోట్లు తీసుకున్నారని ఆదాయపన్ను శాఖ అధికారుల దాడుల్లో వెలుగు చూసింది. ఈ విషయంపై శరత్ కుమార్ ను మళ్లీ విచారణ చెయ్యడానికి అధికారులు సిద్దం అయ్యారు.
రాధికను పిలిచే అవకాశం ఉంది ?
శరత్ కుమార్ భార్య, రాడాన్ మీడియా వర్క్స్ అధినేత రాధికను మళ్లీ పిలిచి విచారణ చేసే అవకాశం ఉందని సమాచారం. శరత్ కుమార్ ను విచారించిన తరువాత అవసరమైతే రాధికకు సమన్లు జారీ చేసి విచారించాలని అధికారులు భావిస్తున్నారని తెలిసింది.
ఉపకులపతి గీతాలక్ష్మికి సమన్లు
డాక్టర్ ఎంజీఆర్ వైద్య విశ్వవిద్యాలయం ఉపకులపతి గీతాలక్ష్మికి అధికారులు సమన్లు జారీ చేశారు. ఈనెల 17వ తేదీన విచారణకు హాజరుకావాలని గీతాలక్ష్మికి అధికారులు సూచించారు. ఇప్పటికే గీతాలక్ష్మికి సమన్లు జారీ చేసి విచారణ చేసిన అధికారులు మళ్లీ కొత్తగా ఆమెకు సమన్లు జారీ చేశారు.
అన్నీ అనుకున్నట్లే జరిగితే
శశికళ వర్గీయులు అన్నీ అనుకున్నట్లే జరిగి ఉంటే ఏ సమస్య వచ్చేది కాదు. ఆర్ కే నగర్ ఉప ఎన్నికలు పూర్తి అయ్యి ఆ నియోజక వర్గం విజేత ఎవరో ఇప్పటికే తేలిపోయి ఉండేది. అయితే మొత్తం చెడింది. ఇప్పుడు ఐటీ శాఖ వలలో చిక్కుకుని గిలగిలకొట్టుకుంటున్నారు.
అందరి చూపు ఆయన మీదే
తమిళనాడు ప్రభుత్వంతో పాటు శశికళ వర్గంలోని నాయకుల అందరి చూపు ఇప్పుడు విజయభాస్కర్ మీద పడింది. ఆయన ఐటీ శాఖ అధికారుల ముందు నోరువిప్పితే మొత్తానికి మోసం వస్తోందని హడలిపోతున్నారు. ఈనెల 17వ తేదీన అందరి జాతకాలు బయటపడే అవకాశం ఉందని సమాచారం.