రూ.66 లక్షల లూటీ కేసు: మైసూరులో వాహనం
బెంగళూరు: బెంగళూరు నగరంలో మంగళవారం మధ్యాహ్నం రూ.66 లక్షలు ఉన్న ఏటీఎం వాహనంతో సహ పరారైన నిందితుడు జేమ్స్ చాకచక్యంగా తప్పించుకున్నాడు. అయితే వాహనం మాత్రం శుక్రవారం మైసూరులో ప్రత్యక్షమైంది. విషయం తెలుసుకున్న పోలీసులు వ్యాన్ లో పరిశీలించగా అందులో నగదు మాయమైంది.
మార్చి 31వ తేది మంగళవారం మద్యాహ్నం ఏటీఎంలలో నగదు నిల్వ చెయ్యడానికి బయలుదేరారు. ఆ సమయంలో సిటీ మార్కెట్ సమీపంలోని అవెన్యూ రోడ్డులో వాహనం నిలిపారు. అప్పుడు సంస్థ సిబ్బంది రూ.15 లక్షలు తీసుకుని ఏటీఎం యంత్రంలో నిల్వ చెయ్యడానికి వెళ్లారు. వారి వెంట సెక్యూరిటీ గార్డు తిమ్మయ్య వెళ్లాడు.
అదే సమయంలో వ్యాన్ డ్రైవర్ జేమ్స్ రూ.66 లక్షలు, డబుల్ బ్యారెల్ గన్ ఉన్న వాహనంతో సహ అక్కడి నుండి పరారయ్యాడు. నాలుగు రోజులుగా పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. శుక్రవారం మైసూరు నగరంలో చోరీకి గురైన ఏటీఎం వాహనం పోలీసులు గుర్తించారు.
అందులో డబుల్ బ్యారెల్ గన్ మాత్రం ఉందని, నగదు లేదని పోలీసులు తెలిపారు. నగదుతో పాటు జేమ్స్ పారిపోయి ఉంటాడని చెప్పారు. బెంగళూరులోని కలాసిపాళ్య పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నకిలీ అడ్రస్!
జేమ్స్ తాను పని చేస్తున్న సంస్థలో కేరళకు చెందిన ఓ అడ్రస్ ఇచ్చాడు. ఆ అడ్రస్కు వెళ్లిన పోలీసులు షాక్ గురయ్యారు. అది తప్పుడు అడ్రస్ అని తేలింది. అతను సంస్థలో ఉద్యోగంలో చేరిన ఐదు రోజులకే రూ.66 లక్షలు లూటీ చేసి మాయమయ్యాడు.