ఇదీ జైషే మహ్మద్ ఉగ్రచరిత్ర : 2016లో సంఖ్య సున్నా... 2019 నాటికి 60 మంది ఉగ్రవాదులు
జమ్మూకశ్మీర్లో గురువారం సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై జరిగిన ఉగ్రదాడిలో 44 మంది జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. పుల్వామాలో జవాన్లు ప్రయాణిస్తున్న బస్సుపైకి అదిల్ హుస్సేన్ దార్ అనే ఉగ్రవాది బాంబులు ఉంచిన స్కార్పియో కారుతో దూసుకెళ్లాడు. అంతకుముందే జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ఏ క్షణమైనా దాడులకు తెగబడే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. గత కొన్నేళ్లుగా ఈ నిషేధిత ఉగ్రవాద సంస్థ బలోపేతం అవుతూ వస్తోంది. స్తబ్దుగా ఉంటేనే కశ్మీర్ వ్యాలీలో వీలు చిక్కినప్పుడల్లా దాడులకు తెగబడుతోంది.
మోడీ ముందు రెండే మార్గాలు: ఉగ్రదాడులను ఎలా తిప్పి కొడుతారు..?
ఉగ్రవాదులకు శిక్షణ
ఇక కశ్మీర్లోయలో జైషే మహ్మద్కు సంబంధించి 60 మంది ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం. వీరిలో ఆత్మాహుతి దాడులకు తెగబడేవారిని, గురితప్పకుండా కాల్పులు జరిపేవారని ఆ సంస్థ తయారు చేసింది. మరోవైపు మరో ఉగ్రవాద సంస్థలైన లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్ సంస్థలను చాలావరకు ధ్వంసం చేసినట్లు భద్రతాదళాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే జైషే మహ్మద్ తన మూలాలను బలోపేతం చేసుకుంది. 2016లో జైషే మహ్మద్ సంస్థకు సంబంధించి ఒక్క ఉగ్రవాది కూడా లేడు. గత మూడేళ్లుగా ఆ సంస్థ తన బలాన్ని, సంఖ్యను లోయలో పెంచుకుంటూపోయింది.
హిజ్బుల్ సంస్థలో 300 ..జైషే సంస్థలో 60 మంది ఉగ్రవాదులే
జైషే మహ్మద్ను నడుపుతున్నది మౌలానా మసూద్ అజర్. ఈ సంస్థను ఆయన 2000వ సంవత్సరంలో స్థాపించారు. పలుదాడులతో సంస్థను ప్రారంభించినప్పటికీ కొన్నేళ్లుగా స్తబ్దుగా ఉంది. తిరిగి పఠాన్కోట్ సైనిక స్థావరంపై దాడులు చేయడంతో మళ్లీ చాలాకాలం తర్వాత ఈ పేరు వినిపించింది. హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థలో పనిచేస్తున్నంత సంఖ్య జైషే మహ్మద్కు లేదు. అయితే మిగతా ఉగ్రవాద సంస్థలకంటే జైషే మహ్మద్ సంస్థే చాలా పవర్ఫుల్గా కనిపిస్తుంది. ఒకవేళ పోల్చి చూడాల్సి వస్తే హిజ్బుల్ సంస్థలో 200 నుంచి 300 మంది ఉగ్రవాదులు పనిచేస్తుండగా... జైషే మహ్మద్ సంస్థలో 40 నుంచి 60 మంది ఉగ్రవాదులున్నారు.
ఉగ్రవాదులు తక్కువైనప్పటికీ ఇలాంటి దాడులు ఎలా చేస్తోంది..?
జైషే మహ్మద్లో ఇంత తక్కువ మంది ఉన్నప్పటికీ ఆ సంస్థ ఎలా బలంగా కనిపిస్తోంది.ముందుగా ఈ సంస్థకు చెందిన ఉగ్రవాదులు చాలా కఠినశిక్షణను పూర్తి చేస్తారు. ఆయుధాలు వినియోగంలో చాలా కచ్చితత్వంతో వ్యవహరిస్తారు. ఎమ్ 4 కార్బైన్ కశ్మీర్ లోయలోకి తొలుత ప్రవేశపెట్టిందే ఈ ఉగ్రవాద సంస్థ. ఫలానా చోట దాడి చేయాలంటే ముందుగా ఓ ప్రణాళిక సిద్ధం చేస్తుంది. ఇందుకు సంబంధించి రిక్రూట్మెంట్ చేసుకుంటుంది. వారికి శిక్షణ ఇస్తారు. ఆ తర్వాతే దాడులకు పంపిస్తారు. ఇక హిజ్బుల్ ముజాహిద్దీన్ కేవలం తన సంఖ్యాబలాన్ని మాత్రమే చెప్పుకుంటుంది. అక్కడి ఉగ్రవాదులకు శిక్షణ అంటూ ఏమీ ఉండదు. ఆయుధాల వినియోగం తెలియదు. ఈ మధ్యకాలంలోనే హిజ్బుల ముజాహిద్దీన్ కమాండర్ తమ వద్ద ఆయుధాలు లేవని చెబుతున్న వీడియో ఒకటి బయటపడింది.
జైషే మహ్మద్ సంస్థకు పాక్ నిధులు
హిజ్బుల్ ముజాహిద్దీన్ ప్రాభవం కోల్పోతోందని మాజీ ఇంటెలిజెన్స్ అధికారి వన్ఇండియాతో మాట్లాడుతూ చెప్పారు. మృతి చెందిన బుర్హాన్ వాణీ సోషల్ మీడియాలో తిరిగి ప్రచారం చేయడం వల్లే హిజ్బుల్ ముజాహిద్దీన్ తిరిగి ప్రాపకం సంపాదించుకుందని ఇంటెలిజెన్స్ అధికారి తెలిపారు. మరోవైపు జైషే మహ్మద్ సంస్థకు పాక్ ఆర్మీతో పాటు ఐఎస్ఐ మద్దతు విరివిగా లభించడంతో ఆ సంస్థ క్రమంగా పెరుగుతూ వచ్చింది. పాకిస్తాన్ ఈ సంస్థకు నిధులు సమకూర్చుతుండటంతో అత్యాధునిక ఆయుధాలు ఈ సంస్థ కొనుగోలు చేస్తోంది. ఆ తర్వాతే నగ్రోటా , పఠాన్ కోట్లపై పెద్ద దాడులకు తెగబడింది జైషే మహ్మద్ సంస్థ. ఇక గత కొన్ని నెలలుగా ఈ సంస్థ వైపు యువత మొగ్గు చూపుతోంది. అయితే ఉగ్రవాద దాడులకు మాత్రం పాక్ జాతీయులను మాత్రమే సంస్థ వినియోగిస్తుంది. స్థానికులు కేవలం సమాచార సేకరణ, పేలుడు సామగ్రిని ఒకచోట నుంచి మరో చోటికి తరలించేందుకు మాత్రమే వినియోగిస్తారని భద్రతా అధికారులు చెబుతున్నారు.
దాడులకు పాక్ జాతీయులే ఎందుకు వినియోగిస్తారు..?
ఇక దాడులకు పాకిస్తాన్ జాతీయులనే ఎందుకు వినియోగిస్తారో కూడా భద్రతా అధికారులు వెల్లడించారు. పాక్ ఉగ్రవాదులకు బాగా తర్ఫీదు ఇస్తారు. అంతేకాదు పెద్ద దాడులు చేసే ముందు వీరిని మానసికంగా కూడా దృఢంగా తయారు చేస్తారు. అంతేకాదు వీరుమాత్రమే చనిపోయేందుకు సిద్ధంగా ఉంటారు. అందుకే పెద్ద దాడులకు పాక్ ఉగ్రవాదులను మాత్రమే వినియోగిస్తారని అధికారులు వెల్లడించారు. వారు ఫిదయీన్ దాడులు మాత్రమే చేస్తారు. దీంతో ఎన్కౌంటర్ చేయడం కూడా కష్టమైపోతుందని వెల్లడించారు.