కరోనా సంక్షోభంపై సీజేఐ కీలక వ్యాఖ్యలు.. కేసుల సంఖ్య ఎంతలా తగ్గిందంటే...
కరోనా సంక్షోభ కాలంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా సుప్రీం కోర్టు వ్యవహరిస్తుందన్న ఆరోపణలను చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే తోసిపుచ్చారు. సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి మూడు ప్రధాన శాఖలైన లెజిస్లేటివ్,ఎగ్జిక్యూటివ్,జ్యుడీషియరీ సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సహనం చాలా అవసరమని.. దేశమంతా సహనంతో ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
న్యాయ వ్యవస్థ జోక్యంపై బోబ్డే..
'సంక్షోభమైనా.. మరే విపత్తు అయినా.. దాన్ని డీల్ చేసేది అధికార యంత్రాంగమే. కోవిడ్-19కి సంబంధించి అధికార యంత్రాంగం చేపడుతున్న చర్యలన్నింటి గురించి మేము అడిగి తెలుసుకున్నాం. అయితే డబ్బు,మెటీరియల్,సిబ్బందిని ఎలా ఉపయోగించుకోవాలన్న విషయాన్ని వాళ్లే నిర్ణయించుకుంటారు. అయితే ప్రజల జీవితాలను ప్రమాదంలోకి నెట్టేలా అధికార యంత్రాంగం వ్యవహరించకూడదు.. అలాంటి పరిస్థితులు తలెత్తితే కచ్చితంగా న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకుంటుంది' అని ఎస్ఏ బోబ్డే తెలిపారు.
తగ్గిన కేసుల సంఖ్య
సంక్షోభ సమయంలో న్యాయ వ్యవస్థ ఏం చేయగలదో.. ఆ పనిచేస్తోందని బోబ్డే అన్నారు. తామేమీ విశ్రాంతి తీసుకోవట్లేదని.. కేసుల పరిష్కారానికి కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. మన క్యాలెండర్ ప్రకారం ఏడాదిలో 210 రోజులు తాము పనిచేస్తామని చెప్పారు. వలస కార్మికుల విషయంలో అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగానికి సూచించామన్నారు. లాక్ డౌన్ పీరియడ్లో కేసుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిందన్నారు. ఈ ఏడాది జనవరిలో సగటున ఒకరోజుకు 205 కేసులు ఫైల్ అయితే.. ఏప్రిల్ నెలలో ఇప్పటివరకూ ఈ-ఫైలింగ్ ద్వారా కేవలం 305 కేసులు మాత్రమే నమోదయ్యాయన్నారు.లాక్ డౌన్ కారణంగానే కేసుల సంఖ్య తగ్గిందన్నారు బోబ్డే. అదే సమయంలో దొంగతనాలు తగ్గిపోయాయని.. క్రైమ్ రేటు కూడా పడిపోయిందని చెప్పారు.
Recommended Video
సుప్రీం తీర్పుపై విమర్శలు..
ఇటీవల వలస కార్మికుల విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై పలు విమర్శలు వచ్చాయి. వలస కార్మికులను కేంద్రం ఆదుకునేలా ఆదేశాలు ఇవ్వాలంటూ స్వామి అగ్నివేశ్, హర్ష్ మందర్ సామాజిక కార్యకర్తలు సుప్రీంలో పిటిషన్లు దాఖలు చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల్లో తాము జోక్యం చేసుకోలేమని... లాక్ డౌన్ కాలంలో వలస కార్మికులకు కనీస దినసరి భత్యం చెల్లించాలని కేంద్రాన్ని ఆదేశించలేమని సుప్రీం కోర్టు తీర్పు స్పష్టం చేసింది. రాష్ట్రాలలోను, కేంద్రంలోనూ పాలించడానికి ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలు ఉన్నాయని తెలిపింది. అక్కడ నిధులు ఉన్నా.. లేకపోయినా.. ఆర్థిక మద్దతునివ్వాలని తాము ప్రభుత్వాలను ఆదేశించలేమని పేర్కొంది. అయితే సుప్రీం తీర్పు కేంద్రానికి అనుగుణంగా ఉందన్న విమర్శలు వినిపించిన నేపథ్యంలో.. తాజాగా బోబ్డే దానిపై స్పందించారు. సంక్షోభ కాలంలో సమన్వయం,సహనం అవసరమని నొక్కి చెప్పారు.