రూ.50 కోట్లు ఇవ్వండి: ముఖ్యమంత్రికి జైలు నుంచి హంతకుడి లేఖ
భువనేశ్వర్: ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్కు జైలు నుంచి ఓ వ్యక్తి బెదిరింపు లేఖ రాశాడు. రూ.50 కోట్లు ఇవ్వాలని ఆ లేఖలో పేర్కొన్నారు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. లేఖ రాసిన వ్యక్తి చత్తీస్గఢ్లోని బిలాస్పూర్ జిల్లా జైలు నుంచి రాసినట్లు పోలీసులు గుర్తించారు.
లేఖ రాసింది ఇతనే
ఛత్తీస్గఢ్లోని జాంజ్గిర్-చంపా జిల్లాకు చెందిన పుష్పేంద్రనాథ్ చౌహాన్ (40) అనే వ్యక్తి దోపిడీ, హత్య కేసులో అరెస్టయ్యాడు. 2009 నుంచి అతను జైల్లో ఉంటున్నాడు. అతను జైలు నుంచే రూ.50కోట్లు తనకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నవీన్ పట్నాయక్కు లేఖ పంపించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆ లేఖను స్వాధీనం చేసుకున్నారు.
గత నెల చివరి వారంలో లేఖ
సదరు వ్యక్తి లేఖలో పేర్కొన్న అంశాలను పరిశీలించి విచారణ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఆగస్ట్ 25వ తేదీన ఈ లేఖ పోలీసులకు అందిందని చెప్పారు. నిందితుడు చౌహాన్ ఈ లేఖను పంపినట్లు గుర్తించి అతడి నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
లేఖ రాసినట్లు ఒప్పుకున్నాడు
తాను ఈ లేఖను లేఖను రాసినట్లు చౌహాను ఒప్పుకున్నాడు. ప్రజల్లో గుర్తింపు పొందేందుకు అతడు ఈ పని చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అతని మానసికస్థితి కూడా సరిగా లేనట్లుగా కూడా తెలుస్తోంది.
మా దృష్టికి వచ్చింది
సీఎం నవీన్ పట్నాయక్కు వచ్చిన బెదిరింపు లేఖను బిలాస్పూర్ పోలీసులు తమ దృష్టికి తీసుకు వచ్చారని ఒడిశా ఇంటెలిజెన్స్ ఏడీజీ తెలిపారు. బిలాస్పూర్ అదనపు ఎస్పీ నీరజ్ చంద్రకర్ ఆదివారం నిందితుడిని విచారణ చేసినట్లు తెలిపారు. గతంలోనూ ఓ కలెక్టర్కు ఈ తరహా లేఖ పంపారని తెలిసిందన్నారు.