హాట్ టాపిక్..కాంగ్రెస్ లో కుమ్ములాట కామనే: ఢిల్లీ లీడర్ల నుండి గల్లీ లీడర్ల వరకు అదే పంధా !!
135ఏళ్ళ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు కామన్ అయిపోయాయి. గ్రాండ్ ఓల్డ్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దేశంలో అధికారంలో ఉన్న బీజేపీతో చేసే ఫైట్ కన్నా, సొంత పార్టీ నేతలతోనే ఎక్కువగా పోరాటం చేయాల్సి వస్తోంది. రోజురోజుకు పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారవుతుంది.
Recommended Video
పార్టీ భవిష్యత్తు పై ఇప్పటికే నమ్మకాలు సన్నగిల్లుతున్న వేళ తాజాగా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సీనియర్లు లేఖ రాయడం, ఆ లేఖపై ఊహించని విధంగా రాహుల్ గాంధీ ఫైర్ అవ్వడం సీనియర్లు రాసిన లేఖ వెనుక బీజేపీ హస్తముందని ఆరోపించడంతో సీడబ్ల్యూసీ సమావేశం రసాభాసగా మారింది. ఘర్షణలకు కేరాఫ్ గా సిడబ్ల్యూసీ మీటింగ్ మారింది.
కాంగ్రెస్ పార్టీలో అగ్రశ్రేణి నాయకుల మధ్య లేని సఖ్యత
రాహుల్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన సీనియర్ నాయకులు పార్టీ కోసం ఇంతలా కష్టపడితే అది గుర్తించకుండా అవమానిస్తారా అని రాహుల్ తీరుపై మండిపడ్డారు. గులాం నబీ ఆజాద్ , కపిల్ సిబాల్ రాహుల్ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతోపాటు బీజేపీకి సంబంధాలున్నాయని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమంటూ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ హైకమాండ్ లోనే ఇప్పటివరకు అగ్రశ్రేణి నాయకుల మధ్య యూనిటీ లేదు. పార్టీకోసం ఏకతాటి మీద కష్టపడే స్వభావం లేదు. ఎన్నికల్లో ఘోర పరాజయం పాలవుతున్నా భవిష్యత్తులోనైనా పార్టీని పటిష్టం చేయాలనే సంకల్పం లేదు.
కాంగ్రెస్ కొత్త అధ్యక్ష ఎంపిక .. కొనసాగుతున్న రచ్చ
గత లోక్సభ ఎన్నికల తరువాత, ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమిని చవి చూడటంతో రాహుల్ గాంధీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్ష పదవి నుంచి వైదొలిగారు. ఆ తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో సోనియాగాంధీ మరోసారి అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. అనారోగ్యంతో ఉన్నప్పటికీ అధ్యక్షురాలిగా ఆమె పార్టీని ముందుకు నడిపించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఆమె పదవీకాలం పూర్తి కావస్తున్న నేపథ్యంలో పదవి నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడి ఎంపిక చెయ్యాలని భావించారు. ఇప్పుడు ఆ అంశమే కాంగ్రెస్ పార్టీలో చిచ్చుపెట్టింది.
రాహుల్ కు సీనియర్ నాయకులకు మధ్య ఘర్షణ .. అధ్యక్ష ఎంపికపై నో క్లారిటీ
గాంధీ కుటుంబం నుండి కాకుండా, ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులుగా ఉండడానికి అభ్యంతరం లేదని గాంధీ కుటుంబం ప్రకటించడంతో పదవి కోసం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పోటీ పడ్డారు. యువ నాయకులు సైతం పోటీలో లేకపోలేదు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పరమ విధేయుల్లా సోనియా గాంధీకి లేఖ రాయడం రాహుల్ గాంధీకి ఆగ్రహం తెప్పించింది. రాహుల్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీలో ఉన్న గ్రూపు తగాదాలు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాయి. రాహుల్ కు సీనియర్ నాయకులకు మధ్య ఏర్పడిన ఘర్షణ వాతావరణంతో అధ్యక్షుడి ఎంపికపై క్లారిటీ లేకుండా పోయింది.
ఢిల్లీ నుండి గల్లీ లీడర్ల దాకా ఇదే పంధా .. ఇలా అయితే పార్టీకి కష్టమే
కాంగ్రెస్ అధినాయకత్వం తీరే ఇలా ఉంటే, ఢిల్లీలో ఉన్న పార్టీ అగ్ర నాయకులే ఇట్లా తగవులాడుకుంటుంటే పార్టీ ఉనికి కష్టమవుతుందని, భవిష్యత్తులో మరింత దెబ్బ తింటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీని మొదటి నుంచి చూస్తున్న కొందరు నాయకులు కాంగ్రెస్ పార్టీలో అంతే, ఢిల్లీ నుండి గల్లీ లీడర్ల వరకు అందరిదీ ఒకే పంధా. గ్రూప్ రాజకీయాలతో తన్నుకోవటం కాంగ్రెస్ పార్టీలో కామన్ అని చెప్తున్నారు. యధా నేషనల్ లీడర్స్ తధా స్టేట్ లీడర్స్ అంటూ పార్టీ పరిస్థితిని చూసి మాట్లాడుకుంటున్నారు రాజకీయ వర్గాలు.