జర్నలిస్టు నుంచి రాజ్యసభ ఉపసభాపతి వరకు... హరివంశ్ ప్రస్థానం
రాజకీయ పార్టీల వ్యూహాల నేపథ్యంలో ఎట్టకేలకు రాజ్యసభ ఉపసభాపతి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి హరివంశ్ నారాయణ్ సింగ్ రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్గా ఎన్నికయ్యారు. హరివంశ్కు 125 ఓట్లు వచ్చాయి. విపక్షాల అభ్యర్థి హరిప్రసాద్కు 105 ఓట్లు వచ్చాయి. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్గా ఎన్నికైనందుకు ప్రధాని మోడీ ఆయన్ను అభినందించారు. హరివంశ్ నారాయణ్ సింగ్ మంచి విద్యావంతుడని కొనియాడారు.
జూన్ 30 1956లో ఉత్తర్ ప్రదేశ్లోని బాలియాలో ఓ మధ్యతరగతి కుటుంబంలో హరివంశ్ నారాయణ్ సింగ్ జన్మించారు. బనారస్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థికశాస్త్రంలో పీజీ పట్టా పొందారు. అదే యూనివర్శిటీ నుంచి జర్నలిజంలో పీజీ డిప్లొమా చేశారు. తన తొలి ఉద్యోగం ద్వారా వచ్చిన జీతం రూ. 500 అని హరివంశ్ గుర్తుచేశారు. కాలేజీలో చదివే రోజుల్లో సామాజిక కార్యకర్తలు, నాయకులైన జయప్రకాష్ నారాయణ్ నుంచి స్ఫూర్తి పొంది 1974లో జేపీ చేపట్టిన ఉద్యమంలో హరివంశ్ కూడా పాల్గొన్నారు.
1977లో ప్రముఖ ఆంగ్ల పత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియాలో జర్నలిస్టుగా పనిచేశారు. ఆ తర్వాత ధర్మయుగ్ మ్యాగజీన్ కోసం పనిచేసేందుకు ముంబైకి వెళ్లారు. 1981వరకు ధర్మయుగ్ మ్యాగజీన్ కోసం పనిచేశారు హరివంశ్ నారాయణ్ సింగ్. 1981 నుంచి 1984 వరకు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేశారు. అనంతరం అమ్రిత్ బజార్ పత్రిక మ్యాగజీన్ నుంచి వచ్చే రవివార్కు అసిస్టెంట్ ఎడిటర్గా పనిచేశారు. అక్కడ ఆయన 1989 వరకు పనిచేశారు. అదే సమయంలో కష్టాల్లో ఉన్న ప్రభాత్ ఖబర్ పత్రికను గట్టెక్కించే బాధ్యతను హరివంశ్కు ఆ సంస్థ అయిన ఉషా మార్టిన్ గ్రూప్ అప్పజెప్పింది. స్వతహాగా సౌమ్యుడైనప్పటికీ.. తన నైపుణ్యంతో ప్రభాత్ ఖబర్ పత్రికను హిందీలో మరో మూడు రాష్ట్రాలు జార్ఖండ్, బీహార్, బెంగాల్లో స్థాపించారు.
1990లో వీపీ సింగ్ తర్వాత దేశ ప్రధానిగా చంద్రశేఖర్ బాధ్యతలు స్వీకరించిన సమయంలో ఆయనకు మీడియా సలహాదారుడిగా హరివంశ్ పనిచేశారు. ప్రభాత్ ఖబర్ పత్రికకు ఎడిటర్గా 25 ఏళ్ల పాటు సేవలందించాకా 2014 ఆయన రాజ్యసభకు నామినేట్ అయ్యారు. జేడీయూ నుంచి హరివంశ్ను రాజ్యసభకు పంపారు బీహార్ సీఎం నితీష్ కుమార్. రాజ్యసభకు ఎన్నికైన నాటికి హరివంశ్కు కనీసం జేడీయూలో పార్టీ ప్రాథమిక సభ్యత్వం కూడా లేదు. రాజ్యసభకు ఎలాంటి పోటీలేకుండా ఎన్నుకోబడ్డ తర్వాత హరివంశ్ సింగ్ తన గతం గురించి మాట్లాడారు. ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టకుండా రాజ్యసభలో ఎలా అడుగుపెట్టాడో నాడు వివరించారు.రాజ్యసభ నామినేషన్ పత్రం కోసం 10వేలు ఖర్చు అయ్యిందని చెప్పిన హరివంశ్... తను రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైనందున ఆ డబ్బును తిరిగి చెల్లించారని గుర్తుచేసుకున్నారు. జర్నలిస్టుగా తన అనుభవం తనపై ప్రభావం చూపిందని చెప్పుకొచ్చారు.