అర్ధరాత్రి నుంచి కొత్త చరిత్ర: రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా జమ్మూకాశ్మీర్, లడఖ్
న్యూఢిల్లీ: భారతదేశ చరిత్రలో రేపటి(గురువారం, అక్టోబర్ 31) నుంచి సరికొత్త అధ్యయం మొదలవనుంది. 1947లో భారతదేశ యూనియన్లో విలీనమైన నాటి నుంచి రాష్ట్రంగా ఉన్న జమ్మూకాశ్మీర్.. రేపట్నుంచి రెండు వేర్వేరు కేంద్రపాలిత ప్రాంతాలు కానున్నాయి.
గురువారమే లెఫ్ట్నెంట్ గవర్నర్ల ప్రమాణం
జమ్మూకాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతానికి ఐఏఎస్ అధికారి గిరీష్ చంద్ర ముర్ము, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతానికి ఆర్కే మాథూర్లు లెఫ్ట్నెంట్ గవర్నర్లుగా ఇప్పటికే నియామకైన విషయం తెలిసిందే. గురువారం శ్రీనగర్, లేహ్లో వేర్వేరు కార్యక్రమాల్లో వీరిద్దరూ ప్రమాణం స్వీకారం చేయనున్నారు. జమ్మూకాశ్మీర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గీతా మిట్టల్.. ముర్ము, మథూర్లతో ప్రమాణం చేయించనున్నారు.
అర్ధరాత్రి నుంచే..
2019 జమ్మూకాశ్మీర్ పునర్విభజన చట్టం ప్రకారం.. అక్టోబర్ 31 నుంచి అంటే బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత నుంచి జమ్మూకాశ్మీర్, లడఖ్లు రెండు వేర్వేరు కేంద్రపాలిత ప్రాంతాలుగా మారనున్నాయి. కాగా, రాజ్యసభలో ప్రకటన చేసిన మూడు నెలల తర్వాత ఇది అమల్లోకి వస్తుండటం గమనార్హం.
ఇదే తొలిసారి..
కాగా, కేంద్రపాలిత ప్రాంతాలు రాష్ట్రాలుగా మారాయి. ఒక రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా ఏర్పాడ్డాయి. కానీ, రాష్ట్రంగా ఉన్న ప్రాంతాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ పరిణామంతో మనదేశంలో మొత్తం 28 రాష్ట్రాలు, 9 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉంటాయి.
ఆర్టికల్ 370 రద్దు.. 2 కేంద్రపాలిత ప్రాంతాలు..
జమ్మూకాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన నరేంద్ర మోడీ ప్రభుత్వం.. జమ్మూకాశ్మీర్ రాష్ట్రాన్ని జమ్మూకాశ్మీర్, లడఖ్లను రెండు వేర్వేరు కేంద్ర ప్రాంతాలుగా కూడా విడగొట్టింది. అయితే, జమ్మూకాశ్మీర్కు అసెంబ్లీ కూడా ఉండనుంది. రెండోసారి అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే ఆర్టికల్ 370ని రద్దు చేస్తామని బీజేపీ ప్రకటించిన నేపథ్యంలో ఈ కార్యానికి పూనుకుంది కేంద్ర ప్రభుత్వం.
సర్ధార్ జయంతి రోజునే ఎందుకంటే..
అక్టోబర్ 26, 1947లో జమ్మూకాశ్మీర్ రాజు మహారాజా హరిసింగ్ తన రాష్ట్రాన్ని భారత యూనియన్లలో విలీనం చేశారు. సరిగ్గా 72 సంవత్సరాల తర్వాత ఆగస్టు 5న జమ్మూకాశ్మీర్ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడగొట్టింది కేంద్ర ప్రభుత్వం.
కాగా, 560 చిన్న చిన్న రాజ్యాలు, రాష్ట్రాలుగా ఉన్న ప్రాంతాలను భారతదేశంలో విలీనం చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి రోజు(అక్టోబర్ 31)నే ఈ రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పడనుండటం గమనార్హం. కాగా, అక్టోబర్ 31న కేవడియా(గుజరాత్), న్యూఢిల్లీలో జరిగే జాతీయ ఐక్యతా దినోత్సవం వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాలు హాజరవుతారు.