అరుణ్ జైట్లీ ప్రస్థానం: విద్యార్థి రాజకీయాల నుంచి కేంద్రమంత్రి వరకు...!
Recommended Video
బీజేపీలో మరో నాయకుడు కన్నుమూశారు. కొద్దిరోజుల క్రితం ఆ పార్టీ నాయకురాలు మాజీ కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ మృతిని మరువక ముందే... మరో మాజీ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ శనివారం ఎయిమ్స్లో తుదిశ్వాస విడిచారు. అరుణ్ జైట్లీ మృతితో ఇటు ప్రధాని మోడీకి వ్యక్తిగతంగా పెద్ద లోటనే చెప్పాలి. జైట్లీ మృతి వార్త తెలుసుకున్న అమిత్ షా, తన హైదరాబాదు పర్యటనను మధ్యలోనే ముగించుకుని ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.
జైట్లీ రాజకీయ ప్రస్థానం
అరుణ్ జైట్లీ 1952 డిసెంబర్ 28న న్యూఢిల్లీలో జన్మించారు. తన తండ్రి మహరాజ్ కిషన్ జైట్లీ న్యాయవాది. తల్లి రత్నప్రభ గృహిణి. 1957 నుంచి 1969 వరకు జైట్లీ విద్యాభ్యాసం ఢిల్లీలోని సెయింట్ క్సేవియర్ స్కూల్లో జరిగింది. 1973లో న్యూఢిల్లీలోని శ్రీరాం కాలేజ్ ఆఫ్ కామర్స్ నుంచి కామర్స్లో డిగ్రీ పట్టా పొందారు. 1977లో యూనివర్శిటీ ఆఫ్ ఢిల్లీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టాపొందారు. ఢిల్లీ యూనివర్శిటీ క్యాంపస్లోనే ఆయన రాజకీయాల్లోకి రావడం జరిగింది. విద్యార్థి రాజకీయాలతో ఆయన పొలిటికల్ ఎంట్రీ ప్రారంభమైంది. ఏబీవీపీలో క్రియాశీలకంగా వ్యవహరించారు జైట్లీ. ఎమర్జెన్సీ సమయంలో జైట్లీ 19 నెలల పాటు జైలు జీవితం గడిపారు. రాజ్నారాయణ్, జయప్రకాష్ నారాయణ్లు అవినీతిపై ప్రారంభించిన పోరాటంలో జైట్లీ పాల్గొన్నారు. ఆ సమయంలో కీలకంగా వ్యవహరించారు. అంతేకాదు జయప్రకాష్ నారాయణ్ ఏర్పాటు చేసిన నేషనల్ కమిటీ ఫర్ స్టూడెంట్స్ మరియు యూత్కు జైట్లీ కన్వీనర్గా పనిచేశారు. 1980లో జైట్లీ బీజేపీ యూత్ వింగ్ అధ్యక్షుడిగా పనిచేశారు.
న్యాయవాద వృత్తి చేపట్టిన జైట్లీ
1987 నుంచి అరుణ్ జైట్లీ సుప్రీంకోర్టుతో పాటు పలు హైకోర్టుల్లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. 1990లో ఢిల్లీ హైకోర్టు జైట్లీని సీనియర్ అడ్వకేట్గా గుర్తించింది. 1989లో అప్పటి వీపీ సింగ్ ప్రభుత్వంలో అడిషనల్ సాలిసిటర్ జనరల్గా నియమితులయ్యారు. బోఫోర్స్ స్కాండల్కు అవసరమైన పేపర్ వర్క్ను జైట్లీ చేశారు. ఇక తన క్లయింట్లుగా ఉన్నవారిలో శరద్ యాదవ్, మాధవరావు సింధియా, ఎల్కే అద్వానీలు ఉన్నారు. అరుణ్ జైట్లీ పలు పుస్తకాలు కూడా రాశారు. భారత్లో అవినీతి, నేరాలపై ఓ పేపర్ను పబ్లిష్ చేశారు. డ్రగ్స్, మనీలాండరింగ్లపై ఐక్యరాజ్యసమితి ఇచ్చిన డిక్లరేషన్లో భారత ప్రభుత్వం తరపున అరుణ్ జైట్లీ హాజరయ్యారు. జైట్లీ ఎన్నో జాతీయ అంతర్జాతీయ కేసులను వాదించారు. అందులో ఒకటి పెప్సీకో వర్సెస్ కోకాకోలా కేసు కూడా ఉంది. ఇక రాజకీయాల్లో యాక్టివ్ కావడంతో న్యాయవృత్తికి గుడ్బై చెప్పేసి పూర్తిగా పాలిటిక్స్కే పరిమితం అయ్యారు.
వాజ్పేయి క్యాబినెట్లో పలు పోర్ట్ ఫోలియోలు
1991 నుంచి భారతీయ జనతా పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్అో సభ్యుడిగా ఉన్నారు. 1999 సాధారణ ఎన్నికల సమయంలో జైట్లీ బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. ఇక 1999లో నాటి అటల్ బిహారీ వాజ్పేయి కేబినెట్లో సమాచారా బ్రాడ్క్యాస్టింగ్ సహాయశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. డిజిన్వెస్ట్మెంట్ మంత్రిగా కూడా తొలిసారిగా జైట్లీ నియమితులయ్యారు. 2000వ సంవత్సరంలో రామ్జెఠ్మలానీ న్యాయశాఖమంత్రిగా రాజీనామా చేశాక, ఆ బాధ్యతలను జైట్లీ నిర్వర్తించారు. 2000వ సంవత్సరంలోనే కేబినెట్ మంత్రిగా ప్రమోషన్ పొందిన జైట్లీ ఆ తర్వాత పూర్తి స్థాయి న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.2009లో రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. రాజ్యసభలో మహిళా రిజర్వేషన్లపై తన వాణిని సమర్థవంతంగా వినిపించారు జైట్లీ. అంతేకాదు అన్నాహజారే తీసుకువచ్చిన జన్లోక్పాల్ పై కూడా మాట్లాడి జైట్లీ అందరి ప్రశంసలు పొందారు.1980 నుంచి రాజకీయాల్లో ఉన్నప్పటికీ 2014 వరకు ఎప్పుడూ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు జైట్లీ.2014లో అమృత్సర్ నుంచి పోటీ చేసి కాంగ్రెస్కు చెందిన అమరీందర్ సింగ్ పై ఓటమిపాలయ్యారు. ఇక గుజరాత్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగిన ఆయన గతేడాది మార్చిలో ఉత్తర్ ప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యునిగా కొనసాగుతున్నారు.
మోడీకి కుడి భుజంగా వ్యవహరించిన జైట్లీ
2014లో మోడీ తొలి ప్రభుత్వంలో జైట్లీ ఆర్థికశాఖ మంత్రిగా పనిచేశారు. ఇక 2015లో వివాహాలు, విడాకులు ప్రాథమిక హక్కుల కిందకు తీసుకురావాలని బలంగా వాదించారు అరుణ్ జైట్లీ. అంతేకాదు ఇన్కమ్ డిక్లరేషన్ స్కీమ్ను కూడా జైట్లీ ప్రకటించారు. జైట్లీ ఆర్థికశాఖ మంత్రిగా ఉన్నసమయంలోనే పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీలు అమలులోకి వచ్చాయి. అవినీతి, నల్లధనం, ఫేక్ కరెన్సీ, ఉగ్రవాదాలు అణిచివేయొచ్చని జైట్లీ అన్నారు. ఇక మే 29, 2019న జైట్లీ స్వయంగా ప్రధాని మోడీకి లేఖ రాశారు. తన అనారోగ్యకారణంగా కేబినెట్లోకి తీసుకోరాదని కోరారు. ఇదిలా ఉంటే జమ్మూ కశ్మీర్ అప్పటి ఆర్థికశాఖ మంత్రి గిర్ధారీ లాల్ డోగ్రా కుమార్తె సంగీతను అరుణ్ జైట్లీ 1982లో వివాహం చేసుకున్నారు.వారికి ఇద్దరు పిల్లలు. ఇద్దరు పిల్లలు న్యాయవాద వృత్తిలో స్థిరపడ్డారు.