జనం నుంచి గుహల్లోకి..! ధ్యానంలో దేశ్ కీ నేత..!!
డెహ్రాడూన్/హైదరాబాద్ : ఎన్నికలు, ప్రచారం, ఉపన్యాసాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, ప్రయాణాలు రాజకీయం అంటే ఈ అంశాలన్నీ నాయకులను ఉక్కిబిక్కిరి చేస్తుంటాయి. సంవత్సరం అంతా చదివిన విద్యార్థులకు వేసవి సెలవులు ఎలా ఉపశమనంగా ఉంటాయో ప్రచారం పర్వం ముగిసిన తర్వాత రాజకీయ నాయకులకు కూడా అలాగే ఉంటుంది. అందులో భాగంగానే బడా నేతల దగ్గర నుండి చోటా నేతల వరకు ఫలితాల ముందు దొరికే రెండు మూడు రోజుల గ్యాప్ ను తమ వ్యక్తిగత అంశాలకు కేటాయిస్తుంటారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా విస్తృతంగా ఎన్నికల ప్రచారం సాగించిన ప్రధాని నరేంద్ర మోదీ శనివారం నుంచి రెండు రోజుల పాటు ఆధ్యాత్మిక పర్యటన సాగిస్తున్నారు. ఏడవది, చివరిది అయిన లోక్సభ ఎన్నికల ప్రచారం శుక్రవారం సాయంత్రంతో ముగియగా, ఆదివారంనాడు పోలింగ్ జరుగనుంది.
ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం శనివారంనాడు ఉత్తరాఖండ్ చేరుకున్నారు. కేదార్నాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి ఓ గుహలో ధ్యానం చేశారు. ఆ ప్రాతంలో జరుగుతున్న కేదార్నాథ్ అభివృద్ధి ప్రాజెక్టును సైతం ప్రధాని ఈ సందర్భంగా సమీక్షించారు. కేదార్నాథ్ వెళ్లే మార్గంలో తాను తీసిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కేదార్నాథ్లో రాత్రి బస చేసిన తర్వాత ఆదివారంనాడు బద్రీనాథ్ బయలు దేరి వెళ్తారు. ఆ సాయంత్రమే తిరిగి ఢిల్లీకి చేరుకుంటారు. ప్రధాని పర్యటన సందర్భంగా కేదారినాథ్, బద్రీనాథ్ ఆలయాల వద్ద భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు.