45 రోజులు.. 150 బహిరంగ సభలు.. సుడిగాలి ప్రచారానికి సిద్ధమైన ప్రధాని మోడీ
ఢిల్లీ : పోలింగ్కు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీలన్నీ ప్రచారం ఉదృతం చేశాయి. స్టార్ క్యాంపెయినర్లను రంగంలోకి దింపి ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డాయి. మొదటి దశ పోలింగ్ కు కేవలం 15 రోజుల సమయం మాత్రమే ఉండటంతో బీజేపీ అగ్ర నాయకులు ప్రచారంలో దూకుడు పెంచాలని నిర్ణయించారు. ప్రధాని నరేంద్రమోడీ నెలన్నర పాటు సుడిగాలి పర్యటనలతో హోరెత్తించేందుకు సిద్ధమవుతున్నారు.
45 రోజులు 150 ర్యాలీలు
ప్రధాని నరేంద్రమోడీ మార్చి 28 నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. 45 రోజుల వ్యవధిలో ఆయన దేశవ్యాప్తంగా 125 నుంచి 150 ర్యాలీల్లో పాల్గొనేలా క్యాంపెయిన్ టీం ప్లాన్ చేసింది. మార్చి 28న మీరట్లో జరగనున్న బహిరంగ సభతో ప్రచారం ప్రారంభించనున్న ప్రధాని... అదే రోజు జమ్మూలోనూ ప్రచారం నిర్వహించనున్నారు. ఇక మార్చి 29, ఏప్రిల్ 1న ఒడిశా, మార్చి 30, ఏప్రిల్ 3న అసోం, బెంగాల్లో జరగనున్న ఎలక్షన్ ర్యాలీలో ప్రధాని పాల్గొంటారు. మార్చ్ 31న మోడీ ఈటా నగర్ ఓటర్లతో మమేకం కానున్నారు.
భారీ స్థాయిలో విజయ్ సంకల్ప్ సభలు
ఎన్నికల ప్రచారంలో దూకుడు మరింత పెంచే క్రమంలో భాగంగా ఆదివారం రోజున ఎంపిక చేసిన 200 ప్రాంతాల్లో విజయ్ సంకల్ప్ పేరుతో భారీ బహిరంగ సభలకు బీజేపీ ప్లాన్ చేసింది. అయితే మోడీ మాత్రం ఈ సభల్లో పాల్గొనే అవకాశం లేదు. ప్రచారంలో భాగంగా ప్రధాని మై బీ చౌకీదార్ ఉద్యమానికి మద్దతు తెలిపిన పార్టీ నేతలు, కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడాలని మోడీ నిర్ణయించారు.
నియోజకవర్గాలను క్లస్టర్లుగా విభజించి ప్రచారం
నరేంద్రమోడీ ప్రతి రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించేలా క్యాంపెయిన్ టీం ప్లాన్ సిద్దం చేసింది. ఇందులో భాగంగా ప్రతి 4 నియోజకవర్గాలను కలిపి ఒక క్లస్టర్ గా విభజించింది. ఆ నియోజకవర్గాల పరిధిలో అందరికీ అనుకూలమైన చోట మోడీ బహిరంగ సభలకు ఏర్పాటు చేస్తోంది. ఇలా చేయడం వల్ల మోడీ ప్రతి నియోజకవర్గ ప్రజలను పలకరించే అవకాశం లభిస్తుందని బీజేపీ భావిస్తోంది.
యూపీ, బీహార్, బెంగాల్ పై ప్రత్యేక దృష్టి
అత్యధిక లోక్సభ స్థానాలున్న ఉత్తర్ ప్రదేశ్, బీహార్, బెంగాల్లో మోడీ టీం ప్రచారంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. యూపీలో 80 లోక్సభ స్థానాలుండగా, బెంగాల్లో 42, బీహార్లో 40 నియోజకవర్గాలున్నాయి. ఈ లెక్కన మోడీ యూపీలో 20, బీహార్, బెంగాల్లో 10 క్లస్టర్లలో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో యూపీ, బీహార్లోని 120 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ 104 స్థానాలు కైవసం చేసుకుంది. అయితే ఇప్పుడు అక్కడ పరిస్థితి నల్లేరుపై నడకలా సాగేలా కనిపించడం లేదు.
బీజేపీ ఓడించేందుకు ఒక్కటైన ప్రత్యర్థులు
మోడీని గద్దె దింపడమే లక్ష్యంగా యూపీలో చిరకాల ప్రత్యర్థులు సైతం ఒక్కటయ్యారు. ఉత్తర్ప్రదేశ్లో ఉప్పు నిప్పులా ఉండే ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీ కూటమిగా ఏర్పడి బీజేపీని ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యాయి. అటు బీహార్లోనూ ఆర్జేడీ నేతృత్వంలో ఐదు పార్టీలు కూటమిగా ఏర్పడటంతో ఈ రాష్ట్రాలపై మోడీ ప్రత్యేక దృష్టి సారించారు. ఇక 2014లో బెంగాల్లో 2, ఒడిశాలో ఒక సీటు మాత్రమే ఖాతాలో వేసుకున్న కమలం పార్టీ ఈసారి ఆ సంఖ్య పెంచుకోవాలని భావిస్తోంది.