నిఫా వైరస్ మరణాలకు ఆ గబ్బిలాలే కారణం... తేల్చేసిన పరిశోధకులు
కేరళలో కలకలం సృష్టించి 17 మంది మృతికి కారణమైన నిఫా వైరస్ పై మిస్టరీ వీడింది. పండ్లను గబ్బిలాలు తినడం వల్లనే వైరస్ వ్యాపించిందని భారత వైద్య పరిశోధన సమాఖ్య (IMCR) తేల్చింది. రాష్ట్రంలోని కోజికోడ్, మల్లాపురం జిల్లాలోనే ఎక్కువమంది వైరస్ సోకి మృతి చెందారు.
నిఫా వైరస్తో మృతి చెందిన తొలి కేసు చోటుచేసుకున్న ప్రాంతాన్ని పరిశోధకులు పరిశీలించారు. కోజికోడ్లోని చంగారోత్ గ్రామంలోని గబ్బిలాలపై సైంటిస్టులు పరిశోధనలు చేశారు. అక్కడ గబ్బిలాల్లో నిఫా వైరస్ బయటపడలేదు. దీంతో పరిశోధకులకు ఏమి చేయాలో అర్థంకాని పరిస్థితి. అయితే మళ్లీ రెండో సారి పరీక్షలు నిర్వహించారు పరిశోధకులు. అయితే అక్కడ పండ్లను అప్పటికే నిఫా వైరస్ ఉన్న గబ్బిలాలు కొరకడం అవే పండ్లను మనుషులు తీసుకోవడంతో వారికీ ఈ వైరస్ సోకిందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు.
ఇదిలా ఉంటే నిఫా వైరస్ను నిర్ధారించేందుకు కాస్త ఎక్కువ సమయం పట్టింది. తొలిసారిగా 21 గబ్బిలాలను పట్టుకున్న పరిశోధకులు వాటిని పరిశీలించి వాటిలో నిఫా వైరస్ లేదని తేల్చారు. రెండో దఫాలో 55 గబ్బిలాలపై పరిశోధనలు జరపగా అందులో పండ్లు తినే గబ్బిలాల్లో నిఫా వైరస్ ఉన్నట్లు గుర్తించారు.
Recommended Video
ఇదిలా ఉంటే కోజికోడ్ మల్లాపురం జిల్లాల్లో ఇక నిఫా వైరస్ లేదని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. జూన్ 1 తరువాత నిఫా వైరస్ కేసులు నమోదు కాకపోవడంతో ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది. నిఫా వైరస్తో మృతి చెందిన 17 మందిలో 14 మంది కోజికోడ్కు చెందిన వారు కాగా... మరో ముగ్గురు మల్లాపురంకు చెందినవారు.