వడ్డీ తగాదా: పండ్ల వ్యాపారి దారుణహత్య
బెంగళూరు: పండ్ల వ్యాపారి ఒకరు దారుణ హత్యకు గురైన ఘటన బెంగళూరులోని కేఆర్ మార్కెట్లో చోటు చేసుకుంది. పాతకక్షల వల్లే ఈ ఘాతుకానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. హతుడి పేరు భరత్. వడ్డీ వ్యాపార లావాదేవీల వ్యవహారంలో భరత్..తమపై కేసు నమోదు చేయించి, జైలుకు పంపించారనే అక్కసుతో అతణ్ని హతమార్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
రాత్రి 8:30 గంటల సమయంలో తన వ్యాపారాన్ని ముగించుకున్న భరత్.. మార్కెట్లోని ఈస్ట్ గేట్ మీదుగా బైక్పై ఇంటికి బయలుదేరాడు. టీ తాగాలనే ఉద్దేశంతో ఈస్ట్ గేట్ పక్కనే ఉన్న ఓ షాప్నకు పక్కనే ఉన్న కేఫ్కు వెళ్లాడు. అదే అదనుగా అతని కోసం కాపుగాసిన ప్రత్యర్థులు భరత్పై దాడి చేశారు. తమ వెంట తెచ్చుకున్న కత్తులతో విచక్షణారహితంగా పొడిచేశారు. కత్తిపోట్లకు గురైన భరత్ను ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో మరణించాడు. శరవణ, వెంకటేష్ అనే ఇద్దరు రౌడీ షీటర్లతో పాటు మరో ముగ్గురు హత్యకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు.
భరత్ సోదరుడు అప్పు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. భరత్, వేలు ఆలియాస్ మార్కెట్వేలు అనే మరో వ్యాపారి మధ్య కొంతకాలంగా వడ్డీ వ్యాపారానికి సంబంధించిన గొడవలు ఉన్నాయి. వారిద్దరూ పరస్పరం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. ఈ ఘటనలో మార్కెట్ వేలు కొద్దిరోజుల కిందట అరెస్ట్ అయ్యాడు.
ప్రస్తుతం బెయిల్పై విడుదలయ్యాడు. తనను జైలుకు పంపించాడనే ఆగ్రహంతో ఉన్న మార్కెట్ వేలు తన బావ శరవణ సహకారంతో భరత్ను హత్య చేయాలని కుట్ర పన్నాడు. శరవణ ఓ రౌడీ షీటర్. అతని సహకారంతో ఒంటరిగా దొరికిన భరత్పై దాడి చేసి హత్య చేసి, అదృశ్యం అయ్యారు. వారిద్దరి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.