వింత పెళ్లి పత్రికలు.. పుచ్చకాయలే వెడ్డింగ్ ఇన్విటేషన్లు
బళ్లారి : వెడ్డింగ్ కార్డులు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. పెళ్లి ఆహ్వానాలు ట్రెండ్ మార్చుతున్నాయి. లోక్సభ ఎన్నికల వేళ నరేంద్ర మోడీ మళ్లీ ప్రధాని కావాలని ఆకాంక్షిస్తూ ప్రింట్ వేయించిన పెళ్లి పత్రికలు వైరల్ గా మారాయి. మొన్నటికి మొన్న ఓటర్ ఐడీ తరహాలో ముద్రించిన మ్యారేజ్ ఇన్విటేషన్లు ఆసక్తి కలిగించాయి. తాజాగా తన పెళ్లికి రావాలంటూ ఓ బాటనీ లెక్చరర్ పంచిన వివాహా ఆహ్వాన పత్రికలు చర్చానీయాంశంగా మారాయి.
మహిళా కానిస్టేబుల్కు కూడా దిక్కులేదు.. హత్య చేసి, కాల్చేసిన ఉన్మాది.. వాడు కూడా కానిస్టేబులే..!
ఇది తినండి..పెళ్లికి రండి
కర్ణాటకలోని బళ్లారికి చెందిన సాయి సందీప్ స్థానికంగా ఓ కాలేజీలో బాటనీ లెక్చరర్ గా పనిచేస్తున్నారు. అదే కాలేజీలో పనిచేస్తున్న మరో లెక్చరర్ తేజస్వినితో పెళ్లి కుదిరింది. అయితే మే 9వ తేదీన జరగనున్న తమ పెళ్లికి వెడ్డింగ్ కార్డు వినూత్నంగా ఉండాలనే ఆలోచనతో ఆయనకు ఓ ఐడియా తట్టింది. అసలే ఎండాకాలం కావడంతో బంధువులకు తామిచ్చే పెళ్లి పత్రిక ఉపయోగపడాలని భావించాడు. అలా వాటర్ మెలన్స్ మీద వివాహానికి సంబంధించిన వివరాలు ముద్రించిన స్టిక్కర్ అతికించి బంధుమిత్రులకు పంపిణీ చేస్తున్నారు.
పెళ్లి కోసం 1000 కుటుంబాలకు ఆహ్వాన పత్రికలు అందించాలి. అలా రోజుకు 100 కుటుంబాల చొప్పున వివాహ పత్రికలు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. అయితే పుచ్చకాయలను రోజుకు 100 చొప్పున కొనుగోలు చేస్తూ బంధుమిత్రులకు పంపిణీ చేస్తున్నారు. అదలావుంటే తమ ప్రయత్నాన్ని అందరూ మెచ్చుకుంటున్నారని సాయి సందీప్ హర్షం వ్యక్తం చేశారు. ఎంత ఖరీదైన పెళ్లి పత్రిక ఇచ్చినప్పటికీ ఇలా చూసి అలా పడేస్తారని.. అదే తామిచ్చిన వాటర్ మెలన్ తిని పెళ్లిరోజు కచ్చితంగా గుర్తుపెట్టుకుంటారని చెబుతున్నారు.
మోడీని బలపరిస్తే చాలు
ఇలాంటి వింత ఆహ్వానాలు, వినూత్న ఆలోచనల పెళ్లి కార్డులు కర్ణాటకలో బాగా దర్శనమిస్తుంటాయి. లోక్సభ ఎన్నికలు జరుగుతుండటంతో చాలా చోట్ల మోడీకి ఓటేయ్యాలనే కాన్సెప్టుతో పెళ్లి కార్డులు ముద్రించారు. వివాహానికి వచ్చే బంధుమిత్రులు కట్నకానుకలు తీసుకురావొద్దని.. మోడీ నాయకత్వం బలపరిచేలా బీజేపీకి ఓటేస్తే చాలనే సందేశం ప్రింట్ చేయించారు. ఈసారి ఇలాంటి పత్రికలు చాలానే దర్శనమిచ్చాయి.
ఓటర్ ఐడీగా వెడ్డింగ్ ఇన్విటేషన్
కర్ణాటక లోక్సభ ఎన్నికలు జరిగిన ఏప్రిల్ 26వ తేదీన ఓ జంట పెళ్లి చేసుకున్నారు. సునీల్, అన్నపూర్ణ అనే జంట తమ పెళ్లి కార్డు.. ఓటర్లలో చైతన్యం కలిగించేలా ఉండాలని డిసైడయ్యారు. దాంతో ఆహ్వాన పత్రికను ఓటర్ కార్డుగా ముద్రించారు. అందులో వారి పేర్లు, వివాహ సమయం, వెన్యూ తదితర వివరాలన్నీ పొందుపరిచారు. అంతేకాదు ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని పేర్కొన్నారు. ఇది చూసిన ప్రతిఒక్కరూ ఆ జంటను అభినందించారు. తమ వివాహాన్ని సమాజాన్ని జాగృతపరిచేలా ప్లాన్ చేసుకోవడం శభాష్ అంటూ కితాబిచ్చారు.
2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఇలాంటి ఓటర్ ఐడీ వెడ్డింగ్ కార్డు దర్శనమిచ్చింది. రైల్వే ఉద్యోగి, సామాజిక కార్యకర్త సిద్దప్ప తన వివాహ పత్రికను ఇలాగే ఓటర్ ఐడీ కార్డు రూపంలో ముద్రించడం విశేషం.