వీళ్లే రేపటి ఓటర్లు: 'సీబీఎస్ఈ లీక్' బీజేపీకి బిగ్ డ్యామేజ్?, అసహనంలో విద్యార్థులు..
న్యూఢిల్లీ: మొన్న వ్యాపం.. నిన్న ఎస్ఎస్సి.. నేడు సీబీఎస్ఈ లీక్.. ఇలా పరీక్షలన్ని స్కాముల్లా మారిపోతున్నాయన్న విమర్శలు బీజేపీ ప్రభుత్వంపై వెల్లువెత్తుతున్నాయి. ఒకరకంగా మోడీ సర్కార్ 'పేపర్ లీక్ సర్కార్'గా మారిపోయిందన్న విమర్శలూ వినిపిస్తున్నాయి.
Recommended Video
దేశవ్యాప్తంగా 28లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన సీబీఎస్ఈ పరీక్షను పకడ్బందీగా నిర్వహించకపోవడం మోడీ ప్రభుత్వ వైఫల్యమే అని విపక్షాలు మండిపడుతున్నాయి.లీకైన పదో తరగతి-మ్యాథ్స్, 12వ తరగతి ఎకనమిక్స్ పేపర్లకు మళ్లీ పరీక్షలు నిర్వహించాలని సీబీఎస్ఈ తీసుకున్న నిర్ణయం కూడా విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో తీవ్ర ఆగ్రహాన్ని, అసంతృప్తిని నింపింది.
అజయ్ మాకెన్ ట్వీట్:
ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ మాకెన్ సీబీఎస్ఈ నిర్ణయంపై ట్విట్టర్ ద్వారా స్పందించారు.
'సీబీఎస్ఈ 12వ తరగతి మ్యాథ్స్ పరీక్ష కోసం మా అబ్బాయి ఔజస్వి చాలా కష్టపడి చదివాడు. బోర్డ్ ఎగ్జామ్స్ అయిపోయాయన్న వాడి ఆనందం ఎంతోసేపు నిలవలేదు.
మ్యాథ్స్ పరీక్ష మళ్లీ రాయాల్సిందేనని సీబీఎస్ఈ చెప్పడంతో తను తీవ్ర అసంతృప్తికి లోనయ్యాడు. తన లాగే ఆవేదన చెందుతున్న లక్షలాది మంది విద్యార్థుల పట్ల నేను చింతిస్తున్నాను' అని చెప్పుకొచ్చారు.
అధికారులు అసలేం చేస్తున్నట్టు?:
'ఈరోజు పదో తరగతి మ్యాథ్స్ పరీక్ష రాసి సంతోషంగా ఇంటికొచ్చాను. పరీక్ష పేపర్ లీక్ అయిందని, మళ్లీ రాయాల్సిందేనని చెప్పడంతో షాక్ తిన్నాను. అధికారులు అసలేం చేస్తున్నారో నిజంగా నాకేమి అర్థం కావడం లేదు' అని ప్రణవ్ విజు అనే పదో తరగతి విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశాడు.
పరీక్షలన్ని స్కాములే: షెహ్లా రషీద్
'వ్యాపమ్ స్కామ్, సీబీఎస్ఈ, ఎస్ఎస్సి.. అన్ని పరీక్షలు కుంభకోణాలే!.. చాలా సిగ్గుచేటు విషయం. ఏ తప్పు చేయని విద్యార్థులు బలైపోతున్నందుకు.. వారికి మద్దతుగా #మార్చ్ఫర్ఎడ్యుకేషన్ దిశగా కదులుదాం.' అని జేఎన్యూ విద్యార్థి నాయకురాలు షెహ్లా రషీద్ తెలిపారు.
పేపర్ లీక్ సర్కార్..: రణ్దీప్ సింగ్
మోడీ సర్కార్ ఇక నుంచి తమ పేరును 'పేపర్ లీక్ సర్కార్' అని మార్చుకోవాల్సిందిగా కాంగ్రెస్ నేత రణ్దీప్ సింగ్ ఎద్దేవా చేశారు. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో మోడీ ప్రభుత్వం చెలగాటమాడిందని మండిపడ్డారు.
మోడీ.. 'వారియర్-2' రాయండి: రాహుల్ సెటైర్
'పరీక్షల సమయంలో ఒత్తిడి నుంచి ఎలా బయటపడాలనే దానిపై ప్రధాని మోడీ 'వారియర్స్' అనే పుస్తకాన్ని రాశారు. ఇప్పుడు పేపర్ లీకేజీతో విద్యార్థుల భవిష్యత్తు నాశనమవడంతో.. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు ఈ ఒత్తిడిని ఎలా అధిగమించాలో చెబుతూ.. మోడీ 'వారియర్స్-2' పుస్తకాన్ని రాస్తే బాగుంటుంది. అని రాహుల్ గాంధీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
గుర్తుంచుకోండి.. వీళ్లే రేపటి ఓటర్లు:
కుంభకోణాలు వెలుగుచూశాక 'కఠిన చర్యలు తీసుకుంటాం' అని ప్రభుత్వాలు చెప్పే మాటలు భారతీయులు ఇప్పుడంత సీరియస్ గా తీసుకోవడం లేదు. ఆ మాటల్లో అంతా డొల్లతనమే ఉంటుందని ఫిక్స్ అయిపోయారు.
మిగతా వాటి సంగతి పక్కనపెడితే.. సీబీఎస్ఈ పేపర్ లీక్ పై మోడీ సర్కార్ కఠిన చర్యలు తీసుకోకపోతే మూల్యం చెల్లించుకోక తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.
నేడు సీబీఎస్ఈ పరీక్ష రాసిన విద్యార్థులంతా 2019లో ఓటర్లుగా మారుతారు కాబట్టి.. బీజేపీ ప్రభుత్వం ఆ విషయం గుర్తుంచుకోవాలంటున్నారు.
ఈ విషయంలో అలసత్వం ప్రదర్శిస్తే.. దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది సీబీఎస్ఈ విద్యార్థులు బీజేపీకి ప్రతికూలంగా ఓటు వేసే అవకాశం ఉందంటున్నారు. చూడాలి మరి, బీజేపీ ఎలాంటి చర్యలు తీసుకోబోతుందో!