రికార్డు స్థాయిలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు: ఆ ‘దేశమే’ కారణమన్న మంత్రి
Recommended Video
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి రికార్డు స్థాయిలో పెరిగుదల నమోదు చేశాయి.. ముడిచమురు ధరలు పెరగడం, రూపాయి పతనమవడంతో దేశీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. శుక్రవారం జీవనకాల గరిష్ఠానికి పెరిగిని డీజిల్ ధరలు శనివారం మరోసారి పెరుగుదలను నమోదు చేశాయి.
మరోవైపు పెట్రోల్ ధరలు కూడా శనివారం జీవనకాల గరిష్ఠాన్ని తాకాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో శనివారం లీటర్ పెట్రోల్ ధర 16 పైసలు పెరిగి రూ. 78.68గా ఉంది. లీటర్ డీజిల్ ధర 21 పైసలు పెరిగి రూ. 70.42గా ఉంది. లీటర్ పెట్రోల్ ధర ముంబైలో రూ. 86.09, కోల్కతాలో రూ. 81.60, చెన్నైలోని 81.72గా ఉంది.
ముంబైలో లీటర్ డీజిల్ ధర రూ. 74.76, కోల్కతాలో రూ. 73.27, చెన్నైలో రూ. 74.39గా ఉంది. ఈ ఏడాది మే నెలలో పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయిలో పెరిగిన విషయం తెలిసిందే. మే 29న దేశ రాజధానిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 78.43గా ఉంది. తాజా పెంపుతో ఆ రికార్డును దాటి పెట్రోల్ ధర జీవనకాల గరిష్ఠానికి చేరింది
ఆ దేశం కారణంగానే పెట్రోల్ ధరలు పెరుగుదల
అమెరికా అనుసరిస్తున్న విధానాలే పెట్రో ధరల పెరుగుదలకు కారణమని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు నిరంతరాయంగా పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన.. అదుపు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అమెరికా అనుసరిస్తున్న ఏకపక్ష విధానాల కారణంగానే డాలరుతో పోల్చితే ప్రపంచంలోని అన్ని దేశాల ద్రవ్య విలువలు తగ్గాయన్నారు. ఈ క్రమంలోనే రూపాయి విలువ కూడా పడిపోయి, ఇంధనం ధరలు విపరీతంగా పెరిగాయని తెలిపారు.