బీజేపీని దెబ్బతీసేలా బెంగాల్కు రైతు ఉద్యమం -టికాయత్ వార్నింగ్ -పెట్రోల్ పెంపు, పంటలకు ధర ఇవ్వరా?
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల కారణంగా బీజేపీ రాజకీయంగా దెబ్బయిపోతోందనడానికి పంజాబ్ స్థానిక సంస్థల ఎన్నికలను రుజువుగా భావిస్తోన్న తరుణంలో.. ఇంకొద్ది రోజుల్లో జరగబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపైనా రైతు ఉద్యమ ప్రభావం తప్పదని రైతు సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు. ఎన్నికల రాష్ట్రాల్లో భారీ ర్యాలీలతో సత్తా చాటుతామంటూ నేతలు సవాళ్లు విసురుతున్నారు..
ఫేస్బుక్ సంచలనం: వార్తా సేవలు బంద్ -మీడియా సంస్థలకు డబ్బు చెల్లించాలన్న చట్టాన్ని నిరసిస్తూ..
కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీ శివారుల్లో రైతులు చేస్తోన్న నిరసనలు గురువారం నాటికి 85రోజులు పూర్తయ్యాయి. రైతులు, కేంద్రం మధ్య ఇప్పటికే 10 దఫాల చర్చలు విఫలం కాగా, జనవరి 26నాటి హింస తర్వాత చర్చల ప్రక్రియ సైతం నిలిచిపోయింది. కేంద్రం, రైతు సంఘాలు ఏ దశలోనూ కాంప్రమైజ్ కు సిద్ధంగా లేకపోవడంతో ఆందోళనలు ఇప్పుడప్పుడే తగ్గేలా లేవు. ఉద్యమాన్ని దేశవ్యాప్తం చేస్తామంటోన్న రైతులు గురువారం దేశవ్యాప్త రైల్ రోకోను చేపట్టారు. ఈ కార్యక్రమం ప్రశాంతంగా ముగిసిందని పలు రాష్ట్రాల పోలీసులు ప్రకటించారు. ఇదిలా ఉంటే..
వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలనే తమ డిమాండ్లకు కేంద్ర ప్రభుత్వం ఏకీభవించకపోతే నిరసనల్ని తీవ్ర తరం చేస్తామని, అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న పశ్చిమ బెంగాల్కు ఆందోళనలను తీసుకెళతామని, బెంగాల్ లో భారీ ఎత్తున ట్రాక్టర్ల ర్యాలీలు తీసి సత్తా చాటుతామని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నాయకుడు రాకేశ్ టికాయత్ హెచ్చరించారు. అంతేకాదు..
పెట్రోల్, డీజిల్ ధరల్ని భారీ ఎత్తున పెంచేసిన కేంద్ర సర్కారు.. పంటలకు కనీస మద్దతు ధర కల్పించడానికి మాత్రం సంకోచిస్తున్నదని, ధాన్యం రేట్లు పెంచాలన్న ఆలోచన కూడా వారికి రావడం లేదని టికాయత్ అన్నారు. కేంద్రం కావాలనే వ్యవసాయాన్ని నాశనం చేస్తోందని, ఆ విధానాలను తాము ఎంతమాత్రమూ సహించబోమని ఆయన అన్నారు. హర్యానాలోని పునియాలో గురువారం నిర్వహించిన నిరసన ర్యాలీలో మాట్లాడుతూ టికాయత్ ఈ వ్యాఖ్యలు చేశారు.
పెట్రో ధరల పాపం గత ప్రభుత్వాలదే -ప్రధాని మోదీ ఫైర్ -ఆయిల్, గ్యాస్ దిగుమతులపై ఆశ్చర్యం
''పంటలు కోతకు వచ్చాయని రైతులు వెనక్కి వెళ్తారనే అపోహ నుంచి కేంద్రం బయటికి రావాలి. వాళ్లు మొండిగా ఉన్నంత కాలం మేం ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు. అవసరమైతే మా పంటను తగలబెడతాం కానీ ఇక్కడి నుంచి కదలం. రెండు నెలల్లో నిరసన ముగుస్తుందనే అపోహలు కూడా మానుకుంటే మంచింది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచే కేంద్రం ధాన్యానికి ఎందుకు ధర పెంచదు? కేంద్రం పరిస్థితిని ఇంక జఠిలం చేయాలని చూస్తే బెంగాల్కు ట్రాక్టర్లు తీసుకుని వస్తాం. బెంగాల్లో కూడా రైతులకు మద్దతు ధర లభించడం లేదు'' అని టికాయత్ అన్నారు.