గుడ్ న్యూస్: పెట్రో, డీజిల్ ధరలు తగ్గే అవకాశం.. ఈ నెలలోనే.. కేంద్రమంత్రి
పెట్రో ధరల పేరు చెబితే చాలు సామాన్యుడు జల్లుమంటున్నాడు. ఏ రోజు ఎంత పెరిగిందని అంటున్నాడు. వాహనం తీయాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. అయితే తాజాగా పెట్రోలియం శాఖ మంత్రి దర్మేంద్ర ప్రదాన్ చల్లటి కబురు చెప్పారు. పెట్రోల్ ధరలు తగ్గే అవకాశం ఉందని చెప్పి.. సామాన్యుడి నెత్తిన పాలు పోశారు. దీంతో మిడిల్ క్లాస్ వాహన వినియోగదారులు లోలోన తెగ సంబరపడిపోతున్నారు.
గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు మార్చి, ఏప్రిల్ నెలల్లో తగ్గే అవకాశం ఉందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ అన్నారు. కరోనా వైరస్ వల్ల గతేడాది ఏప్రిల్లో చమురు ఉత్పత్తి సంస్థలన్నీ ఉత్పత్తి తగ్గించాలని నిర్ణయించాయని ఆయన వివరించారు. అయితే ఇప్పుడు చమురుకు డిమాండ్ పెరగడం, ఉత్పత్తి తక్కువగా ఉండడంతో ధరలు పెరుగుతున్నాయని తెలిపారు.
చమురు ఉత్పత్తిని పెంచాల్సిందిగా ఆయా దేశాలపై తాము ఒత్తిడి తెస్తున్నామని కేంద్రమంత్రి వెల్లడించారు. చమురు దేశాలు ఉత్పత్తిని పెంచితే డిమాండ్, దాంతోపాటే ధర తగ్గుతుందని చెప్పారు. దీంతో దేశంలో పెట్రో ధరలు తగ్గుతాయని ఉదహరణలో సహా వివరించారు. అయితే ప్రస్తుతం పెట్రోల్ లీటర్కు రూ.100కు చేరువలో ఉంది. దీంతో సామాన్యుడు గగ్గోలు పెడుతున్నాడు. నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగాయని చెబుతున్నారు.