ట్విస్ట్: ఐదేళ్ళు జెడిఎస్కే సీఎం పదవిపై నిర్ణయం తీసుకోలేదు: పరమేశ్వర
బెంగుళూరు:కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామి విశ్వాస పరీక్ష చేసుకొనే సమయంలోనే కాంగ్రెస్ పార్టీ నేత, ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం పరమేశ్వర సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐదేళ్ళ పాటు సీఎంగా కుమారస్వామి కొనసాగుతారా, ఈ పదవిని రొటేషన్ లో తమ పార్టీ కూడ తీసుకొంటుందా అనే విషయమై ఇంకా నిర్ణయించలేదన్నారు. అంతేకాదు తమ పార్టీకి ఏఏ పదవులను కేటాయిస్తారనే విషయమై కూడ చర్చించాల్సి ఉందన్నారు.
కర్ణాటక సీఎం కుమారస్వామి మే 25వ తేదిన అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ నేత ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం పరమేశ్వర చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకొన్నాయి.
ఐదేళ్ళపాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలను నిర్వహించాలని కుమారస్వామి భావిస్తున్నారు.అయితే కాంగ్రెస్ పార్టీ నేతలు ఇందుకు సానుకూలంగా ఉంటారా అనేది ఇప్పటికిప్పుడు చెప్పలేం. ఇప్పటికే రెండు డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. అయితే పరమేశ్వర మాత్రం డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు.
కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మంత్రి డికె శివకుమార్ కు డిప్యూటీ సీఎం పదవిని ఇచ్చేందుకు కుమారస్వామి సుముఖంగా లేరని సమాచారం. అయితే కుమారస్వామి, పరమేశ్వర మాత్రమే మే 23వ తేదిన బెంగుళూరులో ప్రమాణస్వీకారం చేశారు. అసెంబ్లీలో బలపరీక్ష తర్వాత మంత్రుల ప్రమాణం చేసే అవకాశం ఉంది.
ఐదేళ్ళపాటు కుమారస్వామినే ముఖ్యమంత్రి పదవిలో కొనసాగించడం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించిన సమయంలో ఈ విషయమై తాము లాభనష్టాలను చర్చించుకోవాల్సి ఉంటుందని పరమేశ్వర చెప్పారు. అయితే ప్రజలకు మంచి పాలన అందించడమే తమ ముందున్న కర్తవ్యంగా పరమేశ్వర చెప్పారు.
ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే ముందే 30 మాసాల పాటు కాంగ్రెస్, జెడి(ఎస్) పార్టీలు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగాలనే విషయమై రెండు పార్టీల మధ్య చర్చలు జరిగాయనే విషయమై జరుగుతున్న ప్రచారాన్ని కుమారస్వామి ఖండించారు. తమ మధ్య ఈ రకమైన ప్రచారమే జరగలేదని ఆయన తేల్చిపారేశారు.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఉపముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి పదవులను నిర్వహించే సమర్ధులు పార్టీలో అనేక మంది నేతలున్నారని ఆయన చెప్పారు. కానీ, ఎవరిని ఏ పదవికి ఎంపిక చేయాలనే విషయం పార్టీ అధినాయకత్వం నిర్ణయం తీసుకొంటుందని చెప్పారు డిప్యూటీ సీఎం పరమేశ్వర.
కాంగ్రెస్ పార్టీ నేత డికె శివకుమార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించారనే ప్రచారంపై పరమేశ్వర స్పందించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలంతా కలిసే ఉన్నారని చెప్పారు. విశ్వాస పరీక్షలో విజయం సాధించనున్నట్టు చెప్పారు.
డికె శివకుమార్ కొందరు ఎమ్మెల్యేలతో సమావేశమైన విషయం నిజామో కాదో తెలియదు కానీ, మేమంతా కలిసికట్టుగా ఉన్నామని ఆయన చెప్పారు.
డిప్యూటీ సీఎం పదవి కావాలనే డికె శివకుమార్ ఆసక్తిగా ఉన్నారని, కానీ, ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం వైఖరి పట్ల ఆయన సంతృప్తిగా లేరని ప్రచారం సాగుతోంది. అయితే మరో డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలనే విషయమై చర్చలు జరిగినట్టు తనకు తెలియదని కాంగ్రెస్ నేత, డిప్యూటీ సీఎం పరమేశ్వర చెప్పారు.అనుభవం నేత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైతే పార్టీకి ప్రయోజనం కలిగే అవకాశం ఉంటుందని పరమేశ్వర చెప్పారు.