అందువల్లే బాంబులు వేశాం: వైమానిక దాడులపై విదేశాంగ మంత్రిత్వశాఖ వివరణ
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్ లో నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఉగ్రవాద శిబిరాలపై మంగళవారం తెల్లవారు జామున భారత వైమానిక దళం నిర్వహించిన దాడులపై కేంద్ర ప్రభుత్వం విస్పష్టమైన ప్రకటన చేసింది. వైమానిక దాడులు ఎందుకు చేయాల్సి వచ్చిందనే విషయాన్ని వివరిస్తూ విదేశాంగ మంత్రిత్వశాఖ కార్యదర్శి విజయ్ గోఖలే ఓ ప్రకటన విడుదల చేశారు. దాడికి గల కారణాలను ఆయన వివరించారు. దీన్ని నాన్ మిలటరీ ఆపరేషన్ గా గుర్తించారు.
ఆ ప్రకటన సారాంశం ఇదీ..
జమ్మూకాశ్మీర్ లోని పుల్వామా జిల్లా అవంతిపురా వద్ద ఈ నెల 14వ తేదీన.. పాక్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోన్న ఉగ్రవాద సంస్థ జైషె మహమ్మద్ నిర్వహించిన దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. పాకిస్తాన్ లో జైషె మహమ్మద్ సంస్థ రెండు దశాబ్దాలుగా క్రియాశీలకంగా ఉంది. మసూద్ అజర్ నేతృత్వంలో బహవాల్ పూర్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను కొనసాగిస్తోంది. 2001 డిసెంబర్ లో భారత పార్లమెంట్ పై, 2016 జనవరిలో పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రవాద దాడులు చేసింది ఈ సంస్థే.
పాకిస్తాన్ సహా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉగ్రవాద శిబిరాలను సంబంధించిన సమాచారాన్ని, ప్రదేశాలను ఎప్పటికప్పుడు ఆ దేశానికి అందజేస్తూ వచ్చాం. పాకిస్తాన్ దీన్ని తోసిపుచ్చుతూ వచ్చింది. వందలాది మంది జిహాదీలకు శిక్షణ ఇస్తున్న శిబిరాలపై పాకిస్తాన్ కు సమాచారం లేదంటే నమ్మశక్యం కాదు. పాకిస్తాన్ భూభాగంపై జైషె మహమ్మద్ ఉగ్రవాదులు సాయుధ శిక్షణ పొందుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని పదే పదే ఆ దేశానికి విన్నవించింది. అయినప్పటికీ.. తమ గడ్డ మీది నుంచి ఉగ్రవాదాన్ని తరిమి కొట్టడానికి పాక్ సరైన చర్యలు తీసుకోలేదు.
జైషె మహమ్మద్ ఉగ్రవాదులు భారత్ లోని వివిధ ప్రదేశాల్లో ఆత్మాహూతి దాడికి పాల్పడ వచ్చనే విశ్వసనీయ సమాచారం అందింది. దీనికోసం ఫిదాయీలు, జిహాదీలకు శిక్షణ ఇస్తున్నట్లు కీలక సమాచారం ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా చేరింది. ఈ అత్యంత ప్రమాదకర పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని, ఉగ్రవాద శిక్షణ శిబిరాలపై దాడులు చేయాల్సిన అవసరం ఏర్పడింది.
మంగళవారం తెల్లవారు జామున నిర్వహించిన వైమానిక దాడుల్లో బాలాకోట్ సమీపంలో జైషె మహమ్మద్ కు చెందిన అతిపెద్ద ఉగ్రవాద శిక్షణ శిబిరం ధ్వంసమైంది. జైషె ఉగ్రవాదులు, శిక్షకులు, సీనియర్ కమాండర్లు, జిహాదీ మూకలు ఈ దాడుల్లో హతమయ్యారు. మౌలానా మసూద్ అజర్ సొంత బావ మౌలానా యూసుఫ్ అజర్ ఆలియాస్ ఉస్తాద్ ఘోరీ బాలాకోట్ శిక్షణ శిబిరానికి నాయకత్వం వహిస్తున్నారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, దాన్ని అణచివేయడానికి భారత ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఇదొక నాన్ మిలటరీ ఆపరేషన్. కేవలం జైషె మహమ్మద్ ను మాత్రమే టార్గెట్ గా చేసుకుని చేపట్టిన దాడులు. భారత పౌరులకు ఎలాంటి ప్రాణాపాయం కలగకూడదనే ఉద్దేశంతోనే వైమానిక దళం జైషె ను టార్గెట్ గా చేసుకుంది.