కాంగ్రెస్ ఎమ్మెల్యే కొడుకు దాడి, సైకో, డ్రగ్స్, గాలి జనార్దన్ రెడ్డి, ఎంపీ శ్రీరాములు ఫైర్!
Recommended Video
బెంగళూరు: బెంగళూరులోని శాంతినగర్ నియోజక వర్గం ఎమ్మెల్యే ఎన్ఏ. హ్యారీస్ కుమారుడు మోహమ్మద్, అతని అనుచరుల దాడిలో తీవ్రగాయాలై మాల్యా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యాపారవేత్త లోక్ నాథ్ కుమారుడు విద్వత్ ను మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి, బళ్లారీ బీజేపీ ఎంపీ శ్రీరాములు, హ్యాట్రిక్ హీరో డాక్టర్ శివరాజ్ కుమార్ పరామర్శించారు. ఈ సందర్బంలో డ్రగ్స్ సేవించిన సైకోలు దాడి చేసినట్లు విద్యత్ మీద దాడి చేశారని గాలి జనార్దన్ రెడ్డి, శ్రీరాములు మండిపడ్డారు.
గాలి, శ్రీరాములు
కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి, బళ్లారి బీజేపీ ఎంపీ శ్రీరాములు విఠల్ మాల్యా రోడ్డులోని మాల్యా ఆసుపత్రి చేరుకుని విద్వత్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని వైద్యులు, కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అదే సమయంలో హ్యాట్రిక్ హీరో శివరాజ్ కుమార్ అక్కడికి చేరుకున్నారు.
కాంగ్రెస్ గూండాగిరి
విద్వత్ ను చూసి ఆసుపత్రి నుంచి బయటకు వచ్చిన బళ్లారి ఎంపీ శ్రీరాములు మీడియాతో మాట్లాడుతూ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు గూండాగిరితో ప్రజలు హడలిపోతున్నారని ఆరోపించారు.
ఎమ్మెల్యే కొడుకు సైకో
శాంతినగర ఎమ్మెల్యే హ్యారీస్ కొడుకు మోహమ్మద్ నలపాడ్ సైకోలా ఉన్నాడని, విద్వత్ ను అంతలా చితకబాదేశారని శ్రీరాములు మండిపడ్డారు. విద్వత్ కంటికి ఇన్ ఫెక్షన్ అయ్యిందని, డాక్టర్ల సూచన మేరకు ఐసీయూలో ఉన్న అతన్ని బయట నుంచి చూసి వచ్చామని బళ్లారి ఎంపీ శ్రీరాములు మీడియాకు చెప్పారు.
నా మిత్రుడు కొడుకు
విద్వత్ తండ్రి లోక్ నాథ్ తనకు చాల సన్నిహితుడని కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి మీడియాకు చెప్పారు. తన స్నేహితుడి కుమారుడు విద్వత్ మీద దాడి చెయ్యడంతో మా కుటుంబ సభ్యుల మీద దాడి చేసినట్లు బాధగా ఉందని, అతను త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు.
డ్రగ్స్ తీసుకున్నాడా ?
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే హ్యారీస్ కొడుకు మోహమ్మద్ నలపాడ్ జీవనశైలి ప్రతి రోజు అర్దరాత్రి మొదలౌతుందని, డ్రగ్స్ తీసుకునే వాళ్లే ఇలా దాడులు చేస్తారని, పోలీసులు మోహమ్మద్ అండ్ కో ను మోకాళ్ల మీద నడిపించి ఊరిగింపు చేసి ఉంటే సరైన శిక్షపడేదని గాలి జనార్దన్ రెడ్డి విరుచుకుపడ్డారు.