గాలి జనార్దన్ రెడ్డి 25వ వివాహ వార్షికోత్సవం: బళ్లారీలో వేడుకలు: పోలిటికల్ రీ ఎంట్రీ !
తన 25వ వివాహ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించుకోవడానికి బళ్లారీకి వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని కర్ణాటక పర్యాటక శాఖ మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి పెట్టుకున్న అర్జీకి సుప్రీంకోర్టు అనుమతి
బెంగళూరు: తన 25వ వివాహ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించుకోవడానికి బళ్లారీకి వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని కర్ణాటక పర్యాటక శాఖ మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి పెట్టుకున్న అర్జీకి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది.
తన సొంత ఊరు బళ్లారీలో 25వ వివాహ వార్షికోత్సవం వేడుకలను కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల సమక్షంలో నిర్వహించుకోవడానికి గాలి జనార్దన్ రెడ్డి పెట్టుకున్న అర్జీని విచారించిన న్యాయస్థానం అందుకు అవకాశం కల్పించడంతో గాలి అనుచరులు సంతోషంగా ఉన్నారు.
నాలుగు రోజులు మాత్రమే బళ్లారీలో !
గాలి జనార్దన్ రెడ్డి 25వ వివాహ వార్షికోత్సవం జరుపుకోవడానికి నాలుగు రోజులు (జూన్ 1వ తేదీ నుంచి) బళ్లారీలో ఉండటానికి సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది. గాలి జనార్దన్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం రాత్రి పొద్దుపోయిన తరువాత బళ్లారీ బయలుదేరి వెళ్లారు.
కుటుంబ సభ్యులతో
గాలి జనార్దన్ రెడ్డి గురువారం బళ్లారీలో శ్రీ దుర్గమ్మ గుడికి భార్య లక్ష్మీ అరుణ, కుమారుడు కిరీటి, కుమార్తె బ్రహ్మిణి, అల్లుడు రాజీవ్ రెడ్డితో కలిసి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. తన కుటుంబ సభ్యులు, సన్నిహితులు, బంధువులు, ప్రజలు క్షేమంగా ఉండాలని దుర్గమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారని గాలి సన్నిహితులు తెలిపారు.
ఇంటికి, కొండకు ప్రత్యేక అలంకరణ !
గాలి జనార్దన్ రెడ్డి 25వ వివాహ వార్షికోత్సవం సందర్బంగా బళ్లారీలోని ఆయన ఇంటిని ప్రత్యేకంగా అలంకరించారు. బళ్లారీ కొండకు విద్యుత్ దీపాలంకరణతో సుందరంగా అలంకరించారు. గురువారం రాత్రి ప్రత్యేక సాంసృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారని సమాచారం.
ఇతరులకు నో ఎంట్రీ !
గాలి జనార్దన్ రెడ్డి 25వ వివాహ వార్షికోత్సవం సందర్బంగా వివిధ సాంసృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారని, ఆ కార్యక్రమాలకు ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు, బంధువులు, శ్రేయోభిలాషులకు మాత్రమే అనుమతి ఉందని, ఇతరులకు ప్రవేశం లేదని సమాచారం.
రైతుల పోరాటానికి మద్దతు ! రీఎంట్రీ ?
తుంగభద్ర జలాశయం విషయంలో రైతులు చేస్తున్న పోరాటానికి గాలి జనార్దన్ రెడ్డి మద్దతు ఇవ్వనున్నారని ఆయన సోదరుడు, మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్ రెడ్డి చెప్పారు. రైతులను కలుసుకుని వారి పోరాటానికి గాలి జనార్దన్ రెడ్డి బహిరంగంగా మద్దతు తెలుపుతారని బళ్లారీ బీజేపీ నాయకులు స్పష్టం చేశారు. గాలి జనార్దన్ రెడ్డి మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద బళ్లారీలో మరో సారి గాలి అనుచరులు ఆనందంలో మునిగిపోయారు.