గాలి జనార్దన్ రెడ్డి ఖైదీ నెంబర్ 10902: పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు, రూ. 20 కోట్ల డీల్ ?
బెంగళూరు: ఆంబిడెంట్ కంపెనీ చీటింగ్ కేసు డీల్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉన్నారు. ఈనెల 24వ తేదీ వరకు జ్యుడీషల్ కష్టడీకి తరలించిన గాలి జనార్దన్ రెడ్డికి జైలు అధికారులు ఖైదీ నెంబర్ 10902 నెంబర్ కేటాయించారు.
ఆంబిడెంట్ కంపెనీ చీటింగ్ కేసును ఈడీ అధికారులు విచారణ చేస్తున్నారు. ఈ కేసులోని నిందితులను ఈడీ అధికారుల విచారణ నుంచి తప్పిస్తానని, కేసు లేకుండా చేస్తానని వారి నుంచి రూ. 20 కోట్లకు గాలి జనార్దన్ డీల్ కుదుర్చుకున్నారని ఆరోపిస్తూ సీసీబీ అధికారులు కేసు నమోదు చేశారు.
కేసు నమోదు చేసిన సీసీబీ పోలీసులు గాలి జనార్దన్ రెడ్డిని ఆదివారం అరెస్టు చేసి కోరమంగలలోని 1వ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి జగదీష్ ఇంటిలో హాజరుపరిచారు. గాలి జనార్దన్ రెడ్డిని విచారణ చెయ్యడానికి కష్టడీకి ఇవ్వాలని సీసీబీ పోలీసులు మనవి చేశారు.
24 గంటల పాటు గాలి జనార్దన్ రెడ్డిని ఇప్పటికే విచారణ చేశారని, అందువలన ఆయన్ను ఈనెల 24వ తేదీ వరవకు జ్యుడీషియల్ కస్టడీకి తరలించాలని న్యాయమూర్తి ఆదేశించారు. న్యాయమూర్తి ఆదేశాలతో గాలి జనార్దన్ రెడ్డిని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు తరలించారు.
గాలి జనార్దన్ రెడ్డి ప్రస్తుతం పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో విచారణ ఖైదీగా ఉన్నారు. గాలి జనార్దన్ రెడ్డిని బెయిల్ మీద బయటకు తీసుకురావాలని ఆయన న్యాయవాదులు హనుమంతరాయ, ఆచార్య, చంద్రశేఖర్ ప్రయత్నాలు చేస్తున్నారు. సోమవారం గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ తీసుకోవడానికి ఆయన న్యాయవాదులు కోర్టును ఆశ్రయించనున్నారు.
Recommended Video