బళ్లారి ఎమ్మెల్యేల దాడులకు సిద్దరామయ్య, డీకే కారణం, వర్గ రాజకీయాలు, గాలి జనార్దన్ రెడ్డి ఫైర్!
బెంగళూరు: బళ్లారి జిల్లాలోని ఎమ్మెల్యేలు రెండు వర్గాలుగా చీలిపోయారు. ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటున్నారు, బళ్లారి జిల్లా ఎమ్మెల్యేల గొడవలకు ముఖ్యకారణం మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, సీనియర్ మంత్రి డీకే. శివకుమార్ అని మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి ఆరోపించారు. ఇంత జరగడానికి ఈ నాయకులే కారణం అని గాలి జనార్దన్ రెడ్డి విమర్శించారు.
ఆనంద్ సింగ్ తో భేటీ
కంప్లీ శాసన సభ్యుడు గణేష్ దాడిలో తీవ్రగాయాలైన మాజీ మంత్రి, విజయనగర ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ బెంగళూరులోని శేషాధ్రిపురంలో ఉన్న ఆపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ ను పరామర్శించడానికి గాలి జనార్దన్ రెడ్డి అపోలో ఆసుపత్రికి వెళ్లారు. ఆ సందర్బంలో గాలి జనార్దన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
సిద్దరామయ్య VS డీకే శివకుమార్
మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, సీనియర్ మంత్రి డీకే. శివకుమార్ మద్య శీతలసమరం మొదలైయ్యిందని గాలి జనార్దన్ రెడ్డి ఆరోపించారు. బళ్లారి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు భీమా నాయక్, గణేష్ సిద్దరామయ్య వర్గంలో ఉన్నారని, మిగిలిన శాసన సభ్యులు డీకే. శివకుమార్ వర్గంలో ఉన్నారని, అందుకే జిల్లాలో వర్గ రాజకీయాలు మొదలైనాయని మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి ఆరోపించారు.
మాయమాటలు చెప్పారు !
ఆనంద్ సింగ్ కు ఏమీ జరగలేదని, సాయంత్రం ఆసుపత్రి నుంచి ఇంటికి వెలుతారని మంత్రి డీకే. శివకుమార్ అపద్దాలు చెప్పారని మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి ఆరోపించారు. మరో మంత్రి జమీర్ అహమ్మద్ తాను ఆనంద్ సింగ్ కు బిరియాని తీసుకుని వెలుతానని ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని గాలి జనార్దన్ రెడ్డి విమర్శించారు.
ఆనంద్ సింగ్ ఆత్మీయుడు
కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ తనకు చాల ఆత్మీయుడని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. ఆనంద్ సింగ్ ను ఆసుపత్రి బెడ్ మీద చూసిన తరువాత తాను చలించిపోయానని, ఆయన కోలుకుని బయట తిరగడానికి ఇంకా కొంత కాలం పడుతుందని గాలి జనార్దన్ రెడ్డి మీడియాకు చెప్పారు.
ప్రభుత్వానికి సిగ్గుందా ?
ఆనంద్ సింగ్ మీద దాడి చేసిన కంప్లీ ఎమ్మెల్యే గణేష్ మాయం అయ్యాడని చెప్పడం ప్రభుత్వానికి సిగ్గుచేటు అని గాలి జనార్దన్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ఎమ్మెల్యే గణేష్ ను అరెస్టు చెయ్యలేదని, వెంటనే అతన్ని అరెస్టు చెయ్యాలని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేగా ఉన్న గణేష్ సాటి ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ మీద దాడి చెయ్యడం మంచి పద్దతికాదని గాలి జనార్దన్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఆపరేషన్ కమల అంటే ?
ఆపరేషన్ కమల గురించి మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి గాలి జనార్దన్ రెడ్డి నిరాకరించారు. ఆపరేషన్ కమలకు తనకు ఎలాంటి సంబంధం లేదని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. శాసన సభ్యుల గొడవలతో కర్ణాటకకు పరువు పోయిందని గాలి జనార్దన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. గతంలో ఆనంద్ సింగ్ గాలి జనార్దన్ రెడ్డి అనుచరుడిగా ఉన్నారు. కొన్ని కారణాలతో ఆనంద్ సింగ్ బీజేపీ నుంచి బయకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరారు.