గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ పిటిషన్ వాయిదా, జైల్లోనే మాజీ మంత్రి: ఏం చెయ్యాలి, పాపం!
బెంగళూరు: ఆంబిడెంట్ కంపెనీ చీటింగ్ కేసులో అరెస్టు అయిన కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డికి మంగళవారం బెయిల్ రాకపోవడంతో ఆయన అనుచరులు ఆందోళన చెందారు. ఆంబిడెంట్ కేసులో గాలి జనార్దన్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని ఆయన మద్దతుదారులు అంటున్నారు. బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా పడటంతో జైల్లో ఉన్న గాలి జనార్దన్ రెడ్డి షాక్ కు గురైనాడని సమాచారం.
విచారణ పేరుతో అరెస్టు
ఆండిడెంట్ చీటింగ్ కేసులో శనివారం మద్యాహ్నం నుంచి ఆదివారం మద్యాహ్నం వరకు గాలి జనార్దన్ రెడ్డిని దాదాపు 24 గంటల పాటు సీసీబీ పోలీసులు విచారణ చేశారు. గాలి జనార్దన్ రెడ్డి సరైన సమాచారం ఇవ్వడం లేదని ఆరోపిస్తూ సీసీబీ పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు.
కస్టడీకి ఇవ్వం
ఆదివారం కోర్టుకు సెలవు కావడంతో కోరమంగలలోని న్యాయమూర్తి ఇంటి ముందు గాలి జనార్దన్ రెడ్డిని హాజరుపరిచారు. గాలి జనార్దన్ రెడ్డిని విచారణ చెయ్యడానికి పోలీసు కస్టడీకి ఇవ్వాలని సీసీబీ పోలీసులు న్యాయమూర్తి ముందు మనవి చేశారు.
జైల్లో పెట్టండి
గాలి జనార్దన్ రెడ్డిని పోలీసు కస్టడీకి ఇవ్వడానికి నిరాకరించిన న్యాయమూర్తి ఈ నెల 24వ తేదీ వరకు జ్యూడీషియల్ కస్టడీకి తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. గాలి జనార్దన్ రెడ్డిని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు తరలించారు.
చాన్స్ లేదు
పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఉన్న గాలి జనార్దన్ రెడ్డి సోమవారం బెయిల్ పిటిషన్ దాఖలు చెయ్యాలని ఆయన న్యాయవాదులకు సూచించారు. కేంద్ర మంత్రి అనారోగ్యంతో మరణించడంతో ప్రభుత్వం కోర్టులకు సోమవారం సెలవు ప్రకటించింది.
కోర్టులో బెయిల్ పిటిషన్
మంగళవారం గాలి జనార్దన్ రెడ్డి న్యాయవాదులు బెంగళూరులోని 1వ సెషన్స్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆంబిడెంట్ కంపెనీ చీటింగ్ కేసుతో, ఆ కంపెనీ నిర్వహకుల డీల్ తో ఆయనకు ఎటువంటి సంబంధం లేదని కోర్టులో వాదించారు.
విచారణ ఖైదీ
కేసు వివరాలు తెలుసుకున్న న్యాయమూర్తి పిటిషన్ విచారణ బుధవారానికి వాయిదా వేశారు. బెయిల్ రాకపోవడంతో పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో విచారణ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న గాలి జనార్దన్ రెడ్డి మరో రోజు జైల్లోనే ఉండాల్సి వచ్చింది. బుధవారం అయినా గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ రావాలని ఆయన మద్దతుదారులు దేవుడిని వేడుకుంటున్నారు.