మాజీ సీఎంకు రూ. 150 కోట్ల లంచం కేసు: సాక్ష్యం చెప్పిన గాలి! ఏం చెప్పారు?
మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి శుక్రవారం లోకాయుక్త ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారుల ముందు హాజరై మాజీ ముఖ్యమంత్రి హెచ్ డీ.
బెంగళూరు: కర్ణాటక పర్యాటక శాఖ మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి శుక్రవారం లోకాయుక్త ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారుల ముందు హాజరై మాజీ ముఖ్యమంత్రి హెచ్ డీ. కుమారస్వామి కేసులో సాక్ష్యం చెప్పారు. అక్రమ మైనింగ్ వ్యవహారం కేసులో అరెస్టు అయ్యి జైలు జీవితం గడిపి వచ్చిన గాలి జనార్దన్ రెడ్డి మరో అక్రమ మైనింగ్ కేసులో నేడు ప్రధాన సాక్షి అయ్యారు.
శుక్రవారం బెంగళూరులో సిట్ అధికారుల ముందు హాజరై సాక్ష్యం చెప్పిన గాలి జనార్దన్ రెడ్డి అనంతరం బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్ డీ కుమారస్వామి రూ. 150 కోట్లు లంచం తీసుకున్నారనే కేసులో తాను సాక్ష్యం చెప్పానని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు.
మాజీ సీఎంకు చిక్కులేనా ?
మరన్ని సాక్షాలు సమర్పించడానికి మూడు వారాల సమయం కావాలని అధికారులకు మనవి చేశానని, అందుకు వారు అంగీకరించారని గాలి జనార్దన్ రెడ్డి మీడియాతో అన్నారు. అయితే కుమారస్వామి మీద గాలి జనార్దన్ రెడ్డి ఏం సాక్షం చెప్పారు ? అనే ఉత్కంఠ నెలకొంది.
11 ఏళ్ల కేసులో గాలి ప్రధాన సాక్షి
2006లో కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్ డీ. కుమారస్వామి ఉన్నారు. ఆ సమయంలో చిత్రదుర్గ జిల్లాలోని జంతకల్ మైనింగ్ నవీకరణ పనులకు అనుమతి ఇవ్వడానికి హెచ్ డీ. కుమారస్వామి భారీ మొత్తంలో లంచం తీసుకున్నారని విచారణ ఎదుర్కొంటున్నారు.
రూ. 150 కోట్లు లంచం ఇచ్చారు
జంతకల్ మైనింగ్ పనుల నవీకరణకు అనుమతి ఇవ్వాలని బళ్లారి జిల్లాలోని మైనింగ్ వ్యాపారుల నుంచి అప్పటి ముఖ్యమంత్రి హెచ్ డీ కుమారస్వామి, అప్పటి హొం శాఖా మంత్రి ఎంపీ. ప్రకాష్, అప్పటి అటవీ శాఖ మంత్రి సి. చెనిగప్ప రూ. 150 కోట్లు తీసుకున్నారని గాలి జనార్దన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
నా దగ్గర వీడియో ఉంది: గాలి
2006లో గాలి జనార్దన్ రెడ్డి కుమారస్వామి తదితరుల మీద సంచలన ఆరోపణలు చేశారు. కుమారస్వామి తదితరులు రూ. 150 కోట్లు లంచం తీసుకున్నట్లు తన దగ్గర వీడియో క్లిప్పింగ్ ఉందని బహిరంగంగా ఆరోపణలు చేశారు. అప్పటి నుంచి కేసు విచారణలో ఉంది.
రూ. 150 కోట్ల లంచం వీడియో ఇవ్వండి
సిట్ ప్రత్యేక అధికారి, డీజీపీ చరణ్ రెడ్డి ముందు శుక్రవారం ( 2017 మే 19) గాలి జనార్దన్ రెడ్డి హాజరై సాక్షం చెప్పారు. మాజీ సీఎం హెచ్ డీ. కుమారస్వామికి విరుద్దంగా గాలి జనార్దన్ రెడ్డి ఏం సాక్షం చెప్పారు ? అని చర్చ మొదలైయ్యింది. మొత్తం మీద మరోసారి గాలి జనార్దన్ రెడ్డి వార్తల్లో కేంద్ర బిందువు అయ్యారు.