ఫైవ్ స్టార్ హోటల్ లో లీజ్ కు గది, సన్మానం ఫోటోతో డ్రామాలు, గాలి జనార్దన్ రెడ్డి!
బెంగళూరు: బెంగళూరు నగరంలోని తాజ్ వెస్ట్ ఎండ్ ఫైవ్ స్టార్ హోటల్ లోని ఓ గదిని తాను లీజ్ కు తీసుకున్నానని, నగరంలో ఉంటే ఎక్కువగా అదే హోటల్ గదిలో ఉంటానని కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. తనను సన్మానం చేసిన ఫోటో అడ్డం పెట్టుకుని నేడు డ్రామాలు ఆడుతున్నారని గాలి జనార్దన్ రెడ్డి ఆరోపించారు. తానకు ఏ డీల్ తో సంబంధం లేదని గాలి జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు.
బెంగళూరు సీసీబీ పోలీసుల విచారణకు శనివారం సాయంత్రం వచ్చిన గాలి జనార్దన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తాజ్ వెస్ట్ ఎండ్ ఫైవ్ స్టార్ హోటల్ లోని తన గదిలో ఉన్న సమయంలో ఆంబిడెంట్ కంపెనీ యజమాని ఫరీద్ తదితరులు అక్కడికి వచ్చారని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు.
అనంతరం వారు నిర్వహిస్తున్న ఓ కార్యక్రమానికి హాజరుకావాలని తనను ఆహ్వానించారని, అదే సమయంలో ఫోటోలు, వీడియో తీశారని గాలి జనార్దన్ రెడ్డి చెప్పారు. తనను సన్మానిస్తున్న ఫోటోలు ఇప్పుడు దుర్మినియోగం చేసి తాను డీల్ లో పాల్గొన్నానని ఇప్పుడు ప్రచారం చేస్తున్నారని గాలి జనార్దన్ రెడ్డి ఆరోపించారు.
ఆంబిడెంట్ డీల్ కు తనకు ఎలాంటి సంబంధం లేదని గాలి జనార్దన్ రెడ్డి చెప్పారు. కర్ణాటక హోం శాఖ మాజీ మంత్రి రామలింగా రెడ్డితో ఫరీద్ ఫోటోలు తీసుకున్నారని, ఆయన్ను ఎందుకు విచారణ చెయ్యడం లేదని గాలి జనార్దన్ రెడ్డి ప్రశ్నించారు.
రామలింగా రెడ్డి కాంగ్రెస్ నాయకుడు కావడం వలనే ఆయన్ను విచారణకు పిలవలేదని గాలి జనార్దన్ రెడ్డి ఆరోపించారు. తన దగ్గర ఎలాంటి బంగారం బిస్కెట్లు, కడ్డీలు లేవని గాలి జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. ఒక్క ఫోటో ఆధారంగా రూ. 20 కోట్లు డీల్, 57 కేజీల డీల్ అంటూ తన మీద ఆరోపణలు చెయ్యడం విడ్డూరంగా ఉందని గాలి జనార్దన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు.